Homeతాజావార్తలుKTR | గెలుపోటములు సహజం.. జూబ్లీహిల్స్​ ఫలితాలపై కేటీఆర్​ వ్యాఖ్యలు

KTR | గెలుపోటములు సహజం.. జూబ్లీహిల్స్​ ఫలితాలపై కేటీఆర్​ వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్​ ఓటమితో నిరాశ చెందొద్దని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ కార్యకర్తలకు సూచించారు. గెలుపు ఓటములు సహజమని అన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | జూబ్లీహిల్స్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా.. బీఆర్​ఎస్​ (BRS) ఓడిపోయింది. ఈ ఓటమిపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ స్పందించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్​ ఫలితం తమను కొంత నిరుత్సాహ పరిచిందని చెప్పారు. అయినా కూడా తాము కుంగిపోవడం లేదన్నారు. ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు ఓటు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నియోజవకర్గంలోని 407 బూత్‌లలో తమ నాయకులు చాలా కష్టపడ్డారని చెప్పారు.

KTR | ప్రత్యామ్నాయం బీఆర్​ఎస్​

ఎన్నికలకు ముందు ప్రతి సర్వే బీఆర్ఎస్​ గెలుస్తుందని చెప్పినట్లు కేటీఆర్​ (KTR) తెలిపారు. చివరి మూడు రోజులు ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. అయితే కాంగ్రెస్​కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ఈ ఎన్నికలతో అర్థం అయిందన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఏడు ఉప ఎన్నికలు జరిగితే ఐదు చోట్ల గెలిచామని గుర్తు చేశారు. కాంగ్రెస్​ ఒకటి కూడా గెలవలేదన్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) 2 సీట్లు గెలిచినా.. కాంగ్రెస్​ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఇలాంటివి కామన్​ అని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ సోషల్ మీడియా వారియర్ల ఎంతో కృషి చేశారన్నారు.

ఫలితాలతో కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్​ సూచించారు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్ అయ్యామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ (Congress) పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని కేటీఆర్​ పేర్కొన్నారు. తమ ప్రచారానికి భయపడి అజారుద్దీన్ (Azaruddin)​కు మంత్రి పదవి ఇచ్చారని కేటీఆర్​ అన్నారు. ఏది ఏమైనా ప్రజాతీర్పు శిరోధార్యం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశపడొద్దని, రబ్బర్‌ బంతిలా మనం కూడా తిరిగి వస్తామని చెప్పారు. గత రెండేళ్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తన పాత్రను అద్భుతంగా పోషించిందన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్​ను నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.

Must Read
Related News