అక్షరటుడే, వెబ్డెస్క్ : Mangal Electrical IPO | ప్రైమరీ మార్కెట్ను ఐపీవోలు ముంచెత్తుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం మంగళ్ ఎలక్ట్రికల్(Mangal Electrical) ఐపీవో ప్రారంభమైంది. ఈ కంపెనీ షేర్లు 28న లిస్టవనున్నాయి. ఐపీవో వివరాలు తెలుసుకుందామా..
రాజస్థాన్లోని జైపూర్(Jaipur)కు చెందిన మంగళ్ ఎలక్ట్రికల్ కంపెనీ ట్రాన్స్ఫార్మర్(Transformers) భాగాలను ప్రాసెస్ చేస్తుంది. విద్యుత్ రంగానికి సేవలందిస్తూ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ఈపీసీ సేవలను కూడా అందిస్తుంది. మంగళ్ ఎలక్ట్రికల్ బ్రాండ్ పేరుతో తన ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఈ కంపెనీ మార్కెట్నుంచి రూ. 400 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవో(IPO)కు వస్తోంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించడానికి, రాజస్థాన్లోని సికార్ జిల్లా రీంగస్లో ఉన్న యూనిట్-4 వద్ద సౌకర్యాన్ని విస్తరించడానికి, జైపూర్లోని ప్రస్తుత ప్రధాన కార్యాలయంలో సివిల్ పనులకు స్థల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి, కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ప్రైస్ బాండ్ : కంపెనీ ధరల శ్రేణి(Price band)ని 10 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు 533 నుంచి 561 గా నిర్ణయించింది. ఒక లాట్లో 26 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్బాండ్ వద్ద రూ. 14,586 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆర్థిక నివేదిక : 2024లో రూ. 452.13 కోట్ల ఆదాయం(Revenue) ఆర్జించిన కంపెనీ.. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాన్ని రూ. 551.39 కోట్లకు పెంచుకుంది. తర్వాత కంపెనీ నికర లాభం(Net profit) రూ. 20.95 నుంచి రూ. 47.31 కోట్లకు పెరిగింది. కంపెనీ ఆస్తులు(Assets) ఇదే కాలంలో రూ. 246.54 కోట్లనుంచి రూ. 366.46 కోట్లకు పెరిగాయి.
ముఖ్యమైన తేదీలు : ఐపీవో బుధవారం ప్రారంభమైంది. 22న సబ్స్క్రిప్షన్(Subscription) గడువు ముగుస్తుంది. 25వ తేదీ రాత్రి అలాట్మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 28న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టవుతాయి.
కోటా, జీఎంపీ : క్యూఐబీలకు 50 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను కేటాయించారు. కంపెనీ షేర్లు గ్రే మార్కెట్(Grey market)లో రూ. 25 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ రోజు 5 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.