అక్షరటుడే, వెబ్డెస్క్ : MLA Defection | ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఎటూ తేలడం లేదు. స్పీకర్ కార్యాలయం (Speaker Office) విచారణ ప్రక్రియలో జాప్యం చేస్తుండమే ఇందుకు కారణమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నెల 6 నుంచి రెండో విచారణ చేపట్టనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ (BRS MLA Party) ఫిరాయించిన విషయం తెలిసిందే. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన స్పందించకపోవడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్కు సూచించింది.
MLA Defection | గడువు ముగిసినా..
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను విచారించారు. వారిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఫిరాయించిన ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయింది. అక్టోబర్ 31తో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన గడువు ముగిసింది. అందరి విచారణ పూర్తికాకపోవడంతో మరో రెండు నెలలు గడువు కావాలని ఇటీవల స్పీకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రెండో విడత విచారణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
నవంబర్ 6న తెల్లం వెంకట్రావ్, సంజయ్ల పిటిషన్లను స్పీకర్ విచారించనున్నారు. 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీల పిటిషన్లపై క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టనున్నారు. 12, 13వ తేదీల్లో రెండోసారి వారి పిటిషన్లను ఆయన విచారిస్తారు. అయితే విచారణ ప్రక్రియ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తవగా.. మరో నలుగురికి సంబంధించి తాజాగా షెడ్యూల్ వెలువడింది. ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేల గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో అసలు స్పీకర్ వారిపై ఎదైనా నిర్ణయం తీసుకుంటారా.. లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
Comments are closed.