అక్షరటుడే, వెబ్డెస్క్ : MLC Kavitha | కాళేశ్వరం నివేదికపై (Kaleshwaram Report) ఓ వైపు బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపడుతున్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఆదివారం అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అక్రమాలను నిగ్గు తేల్చడానికి విచారణను సీబీఐకి (CBI) అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీబీఐకి అప్పగించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ విషయంలో నేరుగా మాట్లాడకున్నా సోమవారం ఉదయం కేటీఆర్తో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్ట్లో అక్రమాలు, అవినీతి జరగలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ కవిత (Kavitha) వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి.
MLC Kavitha | పార్టీ నేతల్లో అయోమయం
కాళేశ్వరం అవినీతికి మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao), సంతోష్రావు (Santhosh Rao) కారణమంటూ కవిత బాంబు పేల్చిన విషయం తెలిసిందే. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆమె.. పరోక్షంగా కేటీఆర్పై వ్యాఖ్యలు చేశారు. తాజాగా హరీశ్రావు, సంతోష్రావు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అవినీతి చేయడంతో కేసీఆర్కు అవినీతి మరకలు అంటాయని ఆమె అన్నారు. గతంలో సైతం బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని చూశారని ఆమె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలు అయోమయం చెందుతున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆమె ఒప్పుకోవడంతో పార్టీకి నష్టం జరుగుతుందని కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కవిత సోషల్ మీడియా అకౌంట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు అన్ఫాలో చేస్తున్నారు.
MLC Kavitha | స్థానిక ఎన్నికల వేళ
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) జరగనున్నాయి. ఈ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం రిపోర్టు బయట పెట్టి బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ యోచించింది. అయితే తాజాగా కవిత వ్యాఖ్యలకు గులాబీ పార్టీని మరింత ఇరుకున పెడుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు అసృంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
MLC Kavitha | ముఖ్యనేతల సమావేశం!
ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ సోమవారం ఉదయం సమావేశమయ్యారు. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించడంపై వారు చర్చించినట్లు సమాచారం. అయితే కవిత వ్యాఖ్యలతో ఫామ్హౌస్లో మరోసారి ముఖ్య నేతల సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆమెపై చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్న ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. కవిత వ్యవహారంపై పార్టీ తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో సైతం ఉత్కంఠ నెలకొంది.