అక్షరటుడే, వెబ్డెస్క్ : Gadwal District | తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లాలో భార్యభర్తల మధ్య ఘర్షణ స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఏదో విషయంలో తీవ్ర ఆవేశానికి లోనైన భార్య, భర్తపై వేడి నూనె పోసి హత్య చేసిన ఘటన మల్దకల్ మండలం(Maldakal Mandal)లోని మల్లెందొడ్డి గ్రామంలో వెలుగు చూసింది.
మల్లెందొడ్డి గ్రామానికి(Mallemdoddi Village) చెందిన వెంకటేష్ (వయస్సు 38), పద్మ భార్యభర్తలు. కొన్నేళ్ల క్రితం వివాహం కాగా, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. గ్రామ పెద్దల జోక్యంతో వివాదాలు తాత్కాలికంగా సద్దుమణిగిన, సమస్యలు కొనసాగుతున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 11వ తేదీన, దంపతుల మధ్య మరోసారి తీవ్ర గొడవ చోటుచేసుకోగా, మాటల యుద్ధం చేయిచేసుకునే వరకు వెళ్లింది.
Gadwal District | ఆవేశంతో..
ఈ సమయంలో భర్త వెంకటేష్ పద్మపై చేయి చేసుకోవడంతో ఆవేశానికి గురైన ఆమె, అరుగుపై ఉన్న వేడి నూనెను భర్తపై పోసింది. ఒక్కసారిగా తీవ్ర గాయాలతో వెంకటేష్ కేకలు వేసాడు.వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు, వెంకటేష్ను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సూచన మేరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి(Kurnool Government Hospital)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సెప్టెంబర్ 16వ తేదీన వెంకటేష్ మరణించాడు.ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, భార్య పద్మపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబానికి అప్పగించినట్లు ఎస్ఐ నందికర్(SI Nandikar) తెలిపారు.
వెంకటేష్, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తండ్రి మరణం, తల్లి జైలు పాలవ్వడం వల్ల ముగ్గురు పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గ్రామస్థులు ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో, కుటుంబ సమస్యలను సంయమనం తో పరిష్కరించుకోవాలని, చిన్న గొడవలు కూడా ప్రాణాంతక పరిణామాలకు దారితీసే అవకాశముందని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.