అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy BJP | ఓటమి చెందినప్పుడు ఈసీపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణ, కర్ణాటక (Karnataka) రాష్ట్రాల్లో గెలిచినప్పుడు ఆరోపణలు ఎందుకు చేయలేదని అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు (Neelam Chinna rajulu) ప్రశ్నించారు.
జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరుసగా ప్రజా క్షేత్రంలో ఓటమి పాలవుతూ తమ తప్పులను తెలుసుకోలేక ఎన్నికల కమిషన్పై ఆరోపణలు చేస్తున్న ఇండియా కూటమి, రాహుల్ గాంధీ చేస్తున్నవి అర్థరహిత ఆరోపణలన్నారు. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా, ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తున్న బీజేపీ గత మూడు పార్లమెంట్ ఎన్నికలలో సగానికి పైగా రాష్ట్రాల్లో ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వచ్చిందన్నారు.
ప్రజల మధ్య కులాల,మతాల వారిగా చిచ్చుపెడుతూ ఎప్పటికప్పుడు దేశంపై, సైనికులపై, హిందూత్వంపై కాంగ్రెస్ తన అక్కసును వెళ్లగక్కుతోందని నీలం చిన్నరాజులు విమర్శించారు. ప్రజల చీత్కారాలకు గురవుతున్న కాంగ్రెస్.. ప్రజల నాడి పట్టుకోకుండా ఈవీఎంలను తప్పు పడుతూ ఇప్పుడు కొత్తగా ఎన్నికల సంఘంపైనే ఆరోపణలు చేస్తుండడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సారథ్యంలో బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల్లో ఆదరణ రోజురోజుకూ పెరుగుతుండటం వల్లే రాహుల్ గాంధీ(Rahul Gandhi), ఇండియా కూటమి (India Alliance) పార్టీలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా లిఖితపూర్వకంగా రాసి ఇస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసినప్పటికీ కావాలనే ఆరోపిస్తూ ప్రజలను, మీడియాను తప్పు తోవ పట్టిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వేణు, నాయకులు సురేష్, సంతోష్ రెడ్డి, రవీందర్, రాజేష్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు
