అక్షరటుడే, వెబ్డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress) తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. తాజాగా అభ్యర్థి ఎంపిక కోసం పీసీసీ ముగ్గురి పేర్లను హైకమాండ్కు సిఫార్స్ చేసింది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోఫినాథ్ మృతితో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఇక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధం అవుతోంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గోపినాథ్ సతీమణి మాగంటి సునీత (Maganti Sunitha)ను ప్రకటించింది. అయితే అధికార పార్టీలో టికెట్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు.
Jubilee Hills | కలిసి పని చేయాలి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులతో చర్చించారు. 22 మంది పరిశీలకులకు ఆమె దిశా నిర్దేశం చేశారు. టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పని చేయాలని సూచించారు. తాజాగా కాంగ్రెస్ అధినాయకత్వానికి మూడు పేర్లను పీసీసీ సిఫార్సు చేసింది. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, CN రెడ్డి పేర్లను ప్రతిపాదించింది. దీంతో వీరిలో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది.
Jubilee Hills | ఎవరికి దక్కుతుందో..
బొంతు రామ్మోహన్ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో వచ్చారు. ఆయన సుదీర్ఘ కాలం బీఆర్ఎస్లో పని చేశారు. తొలిసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ మేయర్గా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన 2024లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో పీసీసీ రామ్మోహన్ పేరును ప్రతిపాదించింది.
నవీన్ కుమార్ మజ్లిస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. 2014 ఎన్నికలలో జూబ్లీహిల్స్ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు. 2023 ఎన్నికలలో సైతం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి అజహరుద్దీన్ కోరడంతో నామినేషన్ విత్డ్రా చేసుకొని కాంగ్రెస్లో చేరారు.
సీఎన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. ఆయనకు కూడా స్థానికంగా పట్టు ఉంది. దీంతో ఈ ముగ్గురిలో అధిష్టానం ఎవరిని ఫైనల్ చేస్తుందో చూడాలి. కాగా అంజన్ కుమార్ యాదవ్ సైతం టికెట్ ఆశించినా ఆయన పేరును రాష్ట్ర నాయకత్వం పరిగణలోకి తీసుకోలేదు.