అక్షరటుడే, వెబ్డెస్క్ : Akbaruddin Owaisi | ఎంఐఎం (MIM) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి అయినా, రావు అయినా.. పని ఎలా పూర్తి చేయాలో తమకు తెలుసన్నారు. తాము వారి వెంట పరిగెత్తే మనుషులం కాదని, వారు తమ వెంట పరిగెత్తే వారు అని అక్బరుద్దీన్ అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by-election) నేపథ్యలో అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిలించాయి. హైదరాబాద్లోని దారుస్సలాంలో ఆయన బుధవారం ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు ఉచిత విద్యా కిట్లు అందించారు. అలాగే పదో తరగతి చదువుతున్న 1,542 మంది విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు కోసం 87 ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Akbaruddin Owaisi | జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఈ నెల 11న జరగనుంది. ఈ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో నవీన్యాదవ్ (Naveen Yadav)ను బరిలో దింపిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సపోర్ట్ తీసుకుంది. మైనారిటీల ఓట్ల కోసం అజారుద్దీన్ (Azharuddin)కు మంత్రి పదవి సైతం ఇచ్చింది. బీఆర్ఎస్ (BRS) కూడా మైనారిటీల ఓట్ల కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. మైనారిటీ నేతలను అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Akbaruddin Owaisi | అధికారంలో ఉన్న వారి వెంట..
రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే ఎంఐఎం పార్టీ వారికి మద్దతుగా ఉంటుంది. గతంలో 2004–14 వరకు కాంగ్రెస్తో ఉన్న ఆ పార్టీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే.. మళ్లీ ఆ పార్టీకి మద్దతు తెలిపింది. అనంతరం కాంగ్రెస్ 2023లో అధికారంలోకి రాగా.. తాజాగా ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు తెలిపింది. అధికారంలో ఉన్న పార్టీలు మిగతా ప్రాంతాల్లో ముస్లింల ఓట్ల కోసం ఎంఐఎంను మచ్చిక చేసుకుంటున్నాయి. గతంలో కేసీఆర్ (KCR) ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం ఎంఐఎం మద్దతు తీసుకున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్, రేవంత్రెడ్డిని ఉద్దేశించి అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేశారు.
