అక్షరటుడే, వెబ్డెస్క్ : EPFO | పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్వో(EPFO) సంస్థ త్వరలో మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
పీఎఫ్ ఖాతాదారులు(PF Account Holders) ఏటీఎం నుంచి నగదు తీసుకునే సదుపాయం తీసుకొస్తామని గతంలో సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి నుంచి ఈ సదుపాయం అమలులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి బోర్డు సభ్యులు అక్టోబర్ రెండో వారంలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.
EPFO | ఎంతో మేలు
ప్రస్తుతం పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు తీసుకోవడానికి ఆన్లైన్ ద్వారా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులు పాక్షికంగా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే పీఎఫ్ ఖాతా(PF Account) నుంచి మాత్రమే నగదు తీసుకునే వీలు ఉంటుంది. పెన్షన్ విభాగంలో జమైన డబ్బులు తీసుకోరాదు. ఉద్యోగం మానేసిన వారు మాత్రం మొత్తం డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. పాక్షికంగా నగదు విత్ డ్రా కోసం ఏటీఎం ద్వారా సైతం అవకాశం కల్పించాలని కేంద్ర కార్మిక శాఖ(Labor Department) నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఖాతాదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
EPFO | అంతా సిద్ధం
ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు తీసుకునే సౌకర్యాన్ని జూన్ నుంచే తీసుకు రావాలని భావించారు. ఈ మేరకు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా సిద్ధం చేశారు. అయితే ఎంత మొత్తం తీసుకోవాలనే పరిమితి విషయంలో బోర్టు ట్రస్టీల సమావేశంలో చర్చించాల్సి ఉంది. దీని కోసం నిర్ణయాన్ని వాయిదా వేశారు. అక్టోబర్లో జరిగే సమావేశంలో లిమిట్పై చర్చించిన అనంతరం జనవరి నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నారు. దీని కోసం ఏటీఎం కార్డు మాదిరి కార్డులను కూడా అందించనున్నారు. కాగా ప్రస్తుతం ఈపీఎఫ్వోకు 7.8 కోట్లమంది చందాదారులు ఉన్నారు.