అక్షరటుడే, ఆర్మూర్: Minister Vakiti Srihari | ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ విధానమని పశుసంవర్ధక, క్రీడలు,యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) అన్నారు. పట్టణంలో సీ కన్వెన్షన్ హాల్లో (C Convention Hall) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చివరి వరుసలో ఉన్న వ్యక్తికి సైతం సంక్షేమ పథకాలు చేరవేయడమే కాంగ్రెస్ పార్టీ తపన అని అన్నారు.
హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందించామని పేర్కొన్నారు. ఈనెల 15న జరగాల్సిన కామారెడ్డి బహిరంగ సభ (Kamareddy public meeting) వాయిదా పడ్డప్పటికీ మరో తేదీని బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందన్నారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పంతో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నబిన్నంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు.
రాష్ట్రాన్ని కేసీఆర్ (KCR) చేతిలో పెడితే 10 ఏళ్లలో రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టారని మంత్రి అన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలోని ప్రజలకు ఇచ్చిన మాట మేరకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను గ్రామ గ్రామాన కార్యకర్తలు చేరవేయాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) డబుల్ బెడ్ రూంల విషయంలో ప్రజలకు భ్రమ కల్పించారన్నారు. ఆర్మూర్ నియోజవర్గ అభివృద్ధికి తన వివిధ శాఖల ద్వారా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర కో-ఆపరేటివ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్రెడ్డి రంగారెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, యల్లసాయిరెడ్డి, మార చంద్రమోహన్, ఆర్మూర్ ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గాడ్, వైస్ ఛైర్మన్ జీవన్, నాయకులు మోత్కూరి లింగాగౌడ్, పండిత్ పవన్, షేక్ మున్న, అయ్యప్ప శ్రీనివాస్, రమణ తదితరులు పాల్గొన్నారు.