PM Modi

PM Modi | ఆపరేషన్​ సిందూర్​తో మన సత్తా చాటాం : ప్రధాని మోదీ


అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ఆపరేషన్​ సిందూర్​తో ప్రపంచానికి మన సత్తా చాటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఆదివారం బెంగళూరులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)​తో సరిహద్దు దాటి ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. ఈ ఆపరేషన్​ భారత సైనిక సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసిందని పేర్కొన్నారు.
రక్షణ రంగంలో మేకిన్ ఇండియా సత్తా ఏంటో చూపించామన్నారు. ఆపరేషన్ సింధూర్​లో బెంగళూరు టెక్ఎంప్లాయీస్ (Bangalore Tech Employees) కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కొందరు అసూయపడేలా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని మోదీ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump)​ డెడ్​ ఎకానమీ అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోదీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని ఆయన పేర్కొన్నారు.

PM Modi | రైలులో ప్రయాణించిన మోదీ

బెంగళూరులోని ఆర్వీ రోడ్డు మెట్రో స్టేషన్‌ను బొమ్మసంద్రకు అనుసంధానించే రెండో దశ మెట్రో కారిడార్​ను ప్రధాని మోదీ(PM Modi) ఆదివారం ప్రారంభించారు. రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. కాగా బెంగళూరు నగరంలో ఎంతో కీలకమైన ఎల్లోలైన్ మెట్రో(Yellow Line Metro) పనులు నాలుగేళ్లుగా సాగుతున్నాయి. ఈ కారిడార్ ఎలక్ట్రానిక్ సిటీలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు మేలు చేస్తుంది. దీనిని రూ.7,160 కోట్ల వ్యయంతో నిర్మించారు.

మోదీ మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను(Vande Bharat Express Trains) జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన వందే భారత్​ రైలులో ప్రయాణించారు. రైలులో విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. అలాగే మోదీ బెంగళూరు మెట్రో ఫేజ్-3 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ.15,610 కోట్లతో 44 కి.మీ. మేర మూడో దశలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ తదితరులు పాల్గొన్నారు.