అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తామని వైస్ఛాన్స్లర్ యాదగిరి రావు (Vice Chancellor Yadagiri Rao) పేర్కొన్నారు. ఈ మేరకు ఇంజినీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కళాశాల (Engineering College) ఏర్పాటు అనేది ఎన్నో ఏళ్ల కల అని అన్నారు. ఈ ప్రాంతంలోని విద్యార్థులకు ఉచితంగా ఇంజినీరింగ్ విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం తెయూ కళాశాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కళాశాలలో సాంకేతికపరమైన బోధనా పద్ధతులతో నాణ్యమైన విద్యను అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డికి (CM Revanth reddy) అందుకు కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (PCC Cheif Mahesh Goud), షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు ఈ సందర్భంగా వేసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు నందిని, అతిక్ సుల్తాన్ గోరి, భ్రమరాంబిక, నీలిమ, ఇంజినీరింగ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.