అక్షరటుడే, కామారెడ్డి: BC JAC | కామారెడ్డి గడ్డ.. ఉద్యమాల అడ్డా అని.. ఇక్కడి నుంచే బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీసీ జేఏసీ ప్రకటించింది. పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో బుధవారం బీసీ జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఈనెల 18న జరిగిన బీసీ జేఏసీ బంద్ (BC Bandh) విజయంలో సమిష్టి కృషి ఉందన్నారు. ఈ బంద్ విజయం స్ఫూర్తితో త్వరలో నిరంతర కార్యాచరణ రూపొందిస్తున్నామని.. కామారెడ్డి గడ్డ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.
అగ్రవర్ణాల కుట్రల్ని తిప్పికొట్టే విధంగా, బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అఖిలపక్ష రాజకీయ పార్టీలు చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లకు (BC Reservations) మద్దతు తెలిపిన నేపథ్యంలో.. రిజర్వేషన్లు చట్టబద్ధం చేసి 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా ఉద్యమం చేస్తామన్నారు.
స్థానిక సంస్థల (Local Bodys) నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు, అదేవిధంగా విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేశామన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సాప శివరాములు, నీల నాగరాజు, కుంబాల లక్ష్మణ్ యాదవ్, ఎంజీ వేణు గోపాల్ గౌడ్, నునావత్ గణేశ్ నాయక్, క్యాతం సిద్ధరాములు, వెంకట్ గౌడ్, మర్కంటి భూమన్న, చింతల శంకర్, రాజన్న, నర్సింలు, బాజ లలిత, కొత్తపల్లి మల్లన్న, మంజుల, అరుణ్, విఠల్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

