అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | గ్రూప్–1 ఉద్యోగం (Group-1 Job) సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్రెడ్డి శనివారం శిల్పా కళా వేదికలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని ఉద్యోగులకు సీఎం సూచించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు త్వరలో చట్టం తీసుకు వస్తామని సీఎం తెలిపారు. సర్వం త్యాగం చేసి పెద్ద చేసిన వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో నుంచి 10 శాతం కట్ చేస్తామన్నారు. ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల (Parents) ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.
CM Revanth Reddy | నమ్మక ద్రోహం చేశారు
తెలంగాణకు వీరోచిత చరిత్ర ఉందని సీఎం అన్నారు. ఆరు దశాబ్దాలు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. కానీ కొందరు ఒక పార్టీ, ఒక కుటుంబం కోసమే తెలంగాణ అన్న భ్రమలో ఉన్నారని విమర్శించారు. కాలం కలిసొచ్చి రెండుసార్లు గెలిస్తే వారు కారణజన్ములు అనుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నో ఆశలతో గెలిపించిన తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. వారు కాలగర్భంలో కలిసిపోతారని సీఎం పేర్కొన్నారు.
CM Revanth Reddy | పదేళ్లు గ్రూప్-1 నిర్వహించలేదు
బీఆర్ఎస్ (BRS) హయాంలో పదేళ్లు గ్రూప్–1 పరీక్ష నిర్వహించలదేని సీఎం అన్నారు. వాళ్లు ఉద్యమకారులా అని ప్రశ్నించారు. తెలంగాణ స్ఫూర్తి వారిలో ఎక్కడుందన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)లో బీఆర్ఎస్ హయాంలో ఓ టీచర్ను, ఆర్ఎంపీ డాక్టర్ను వేశారన్నారు. దీంతో ఆనాడు వారు నిర్వహించిన పరీక్షల ప్రశ్నా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికాయన్నారు. టీజీపీఎస్సీని తాము ప్రక్షాళన చేశామన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని కమిషన్ సభ్యులుగా నియమించామని పేర్కొన్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో రాజకీయ పునరావాస కేంద్రంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మార్చారని ఆరోపించారు.
CM Revanth Reddy | ఆపాలని చూశారు
కొందరు కడుపు నిండా విషం పెట్టుకొని గ్రూప్–1 నియామకాలను ఆపాలని చూశారని రేవంత్రెడ్డి ఆరోపించారు. రూ.2–3కోట్లు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చానని తనపై ఆరోపణలు చేశారన్నారు. నియామకాలను ఆపడానికి కుట్ర చేసిన వారిలో కోచింగ్ సెంటర్ల (Coaching Centers) నిర్వాహకులు సైతం ఉన్నారని ఆయన ఆరోపించారు. గ్రూప్–1 నియామకాల కోసం ఏకాగ్రతతో పోరాటం చేశామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ దేశానికి మోడల్ కావాలంటే కొత్తగా ఎంపికైన వారు ఉత్తమంగా పని చేయాలని ఆయన సూచించారు. పేదలు, నిస్సహాయులు పని కోసం వచ్చినప్పుడు ఉద్యోగులు తమ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకొని సాయం చేయాలన్నారు.