HomeతెలంగాణHeavy Rains | వరంగల్‌లో కుండపోత వర్షం.. వ‌ర‌ద‌లో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు

Heavy Rains | వరంగల్‌లో కుండపోత వర్షం.. వ‌ర‌ద‌లో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | వరంగల్ (Warangal) నగరంలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ముఖ్యంగా రైల్వే అండర్ బ్రిడ్జ్‌ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వరద నీటిలో రెండు ఆర్టీసీ (RTC) బస్సులు పూర్తిగా చిక్కుకుపోయిన ఘటనతో సహాయక చర్యలు హడావుడిగా సాగాయి. బస్సుల్లో ఉన్న సుమారు వంద మంది ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. మహబూబాబాద్, అన్నారం నుంచి వరంగల్ వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు రైల్వే అండర్ పాస్ (Railway underpass) వద్ద వరదల్లో చిక్కుకున్నాయి. లోతు తక్కువగా ఉందనుకొని డ్రైవర్లు ముందుకు వెళ్లగా, నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఇంజిన్లు ఆగిపోవడంతో బస్సులు మధ్యలోనే నిలిచిపోయాయి.

Heavy Rains | ప్రయాణికుల ఆందోళన

వరద నీటిమ‌ట్టం క్ర‌మంగా పెరుగుతూ ఉండ‌డంతో బ‌స్సులోని ప్ర‌యాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమను కాపాడాలని కేకలు వేశారు. బస్సులు కదల్లేని స్థితిలో ఉండడంతో తక్షణ సహాయం అవసరమైంది. సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ (Mills Colony) పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. ఒక పెద్ద తాడు సాయంతో ప్రయాణికులను ఒక్కొక్కరుగా బయటకు రప్పించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొత్తం 100 మందికిపైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడడం ఊపిరి పీల్చుకునేలా చేసింది.

Heavy Rains | రాకపోకల నిలిపివేత

ఈ ఘటన అనంతరం, రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రయాణికులు పోలీసుల (Police) తక్షణ స్పందనను ప్రశంసించారు. “పూర్తిగా నీటిలో చిక్కుకుపోయాం. ఒక్క‌ క్షణం ప్రాణాలు పోయినంత పనైంది. పోలీసులు, స్థానికులు వచ్చిన తర్వాతే ఊపిరి పీల్చుకున్నాం” అంటూ ఓ ప్రయాణికుడు మీడియాతో తెలిపారు.