అక్షరటుడే, ఇందూరు: BC Reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఈనెల 16న రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ‘వాక్ ఫర్ జస్టిస్’ (Walk for Justice) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు.
ఈమేరకు నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో (Care Degree College) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ ‘అష్టాదశ’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా బీసీ జేఏసీ రాష్ట్ర కో–ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో ఆదివారం వాక్ ఫర్ జస్టిస్ కార్యక్రమనికి చేపట్టనున్నట్లు తెలిపారు. నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో (Polytechnic Ground) ఉదయం ఏడు గంటలకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో బీసీలందరూ పెద్దఎత్తున పాల్గొని రిజర్వేషన్ల కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ.. ఈ ’వాక్ ఫర్ జస్టిస్’ కార్యక్రమంలో బీసీలతో పాటు బహుజనలు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు దర్శనం దేవేందర్, కరిపె రవీందర్, కొయ్యాడ శంకర్, బగ్గలి అజయ్ చంద్రకాంత్, ఆర్టీసీ నర్సయ్య, బాలన్న, నరేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.