అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | నిజామాబాద్ నగరంలో సెప్టెంబర్ 6న తేదీన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఉంటుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ సందర్భంగా 8 ఫీట్ల కన్నా ఎక్కువ ఎత్తు గల విగ్రహాల నిమజ్జనానికి పోలీసులు సూచించిన నిబంధనలు పాటించాలన్నారు.
జాన్కంపేటలో రైల్వే హైటెన్షన్ లైన్ ఉన్నందున.. ఆ రూటులో 8 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు గల వాహనాలు వెళ్లడం నిషిద్ధమన్నారు. గణేశ్ విగ్రహం 8 ఫీట్లలోపు ఉన్నట్లయితే విగ్రహాలను పాత రూట్ ప్రకారంగా నెహ్రూపార్కు, అర్సపల్లి , జాన్కంపేట్, నవీపేట్ మీదుగా బాసరకు (Basar) వెళ్లాలన్నారు. 8 ఫీట్ల కన్నా ఎత్తుగల విగ్రహాలను రూటు మార్చడం జరిగిందని పేర్కొన్నారు. గణేశ్ మండలి నిర్వాహకులు తప్పకుండా గమనించాలన్నారు.
Nizamabad CP | భారీ విగ్రహాల నిమజ్జనం రూట్ మ్యాప్
భారీ గణేశ్ నిమజ్జనాల రూట్ మ్యాప్ Route Map) పూర్తిగా పాత నిజామాబాద్ ఏరియా వారు గాజుల పేట శివాజీ నగర్, గోల్ హనుమాన్, అంగడి బజార్, ఎల్లమ్మ గుట్ట, పూలాంగ్, రాజారాజేంద్ర చౌరస్తా చూట్టు ప్రాంతాలు, సాయినగర్ , గాయత్రి నగర్, కోటగల్లి, హౌసింగ్ బోర్డు, బోర్గాం, న్యాల్కల్, నాగారాం మొదలైన ప్రాంతాల వారు పూలాంగ్ – ఎన్టీఆర్ చౌరస్తా – రైల్వే స్టేషన్ – బస్ స్టేషన్ – రైల్వే ఓవర్ బ్రిడ్జి – శివాజీ చౌక్ – దుబ్బా – జీజీ కాలేజీ చౌరస్తా – బైపాస్ రోడ్డు – డీఎస్ చౌరస్తా – ముబారక్ నగర్ – మాణిక్ బండార్ – దాస్ నగర్ – మాక్లూర్ – నందిపేట్ ఉమ్మెడ గ్రామ (Ummeda Village) సరిహద్దులో గల గోదావరి బ్రిడ్జికి వెళ్లవచ్చని పేర్కొన్నారు. గణేశ్ మండళ్ల నిర్వాహకులు, భక్తులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
Nizamabad CP | నిబంధనలు తప్పకుండా పాటించాలి
నిజామాబాద్ జిల్లా ప్రజలు పోలీసుల నిబంధనలు (Police Rules) తప్పకుండా పాటించాలని కమిషనర్ సాయి చైతన్య కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా డీజేలు ఏర్పాటు చేయవద్దని తెలిపారు. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. రెసిడెన్షియల్, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ మాత్రమే వాడాలని తెలిపారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజేల సౌండ్ సిస్టం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.
ఇక ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన డీజేలు, సౌండ్ సిస్టంలు (DJ and Sound Systems) నిషేధించినట్లు వివరించారు. ఎవరైనా సభలు, సమావేశాలు జన సంచార ప్రదేశాల్లో లౌడ్ స్వీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. 500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే ఏసీపీ అనుమతి తప్పనిసరన్నారు. 500 మందికంటే ఎక్కువ మందితో కూడిన కార్యక్రమానికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు.
Nizamabad CP | సార్వజనిక ప్రదేశాల్లో నియమాలు
మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరి పాటించాలని పేర్కొన్నారు. డ్రోన్ల వాడకం వలన ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో నియంత్రణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. డ్రోన్లను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాడాలనుకుంటే సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పోలీసు, ఏవియేషన్ అధికారుల క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
Nizamabad CP | నకిలీ గల్ఫ్ ఏజెంట్ల నుండి అప్రమత్తం
నకిలీ గల్ఫ్ ఏజెంట్ల (fake Gulf agents) పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. పాస్పోర్టు, వీసా రవాణా, టూరిస్ట్ తదితర సేవలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి కొందరు గల్ఫ్ ఏజెంట్లు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కావున జిల్లా ప్రజలు గల్ఫ్ ఏజెంట్లకు తమ ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అటువంటి వారు అద్దెకు వస్తే ముందస్తుగా వారి సమాచారం పోలీసులకు తెలియజేయాలన్నారు.