అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రామపరిపాలన అధికారి (GPO) లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.
జీపీవో బానోత్ శ్రీనివాస్ నాయక్ పూసుగూడెం (Poosugudem)కు చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ. 60 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఇప్పటికే రూ.40 వేలు చెల్లించాడు. అనంతరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సోమవారం తహశీల్దార్ కార్యాలయం (Tahsildar Office)లో రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా.. గ్రామ పరిపాలన అధికారి శ్రీనివాస్ నాయక్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ రమేష్ (ACB DSP Ramesh) ఆధ్వర్యంలో కార్యాలయంలో సోదాలు చేపట్టారు.
ACB Raids | గతంలోనూ..
శ్రీనివాస్ నాయక్ గతంలో వీఆర్వోగా పనిచేశాడు. అప్పుడు కూడా అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీఆర్వోలు అవినీతికి పాల్పడుతున్నారని గత ప్రభుత్వం ఆ వ్యవస్థను తొలగించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్వోల స్థానంలో గ్రామ పరిపాలన అధికారులను తీసుకొచ్చింది. గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పని చేసిన వారికి అవకాశం కల్పించింది. ఇటీవల వారు ఉద్యోగాల్లో చేరారు. ఇందులో భాగంగా జీపీవోగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ నాయక్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
ACB Raids | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
