అక్షరటుడే, వెబ్డెస్క్ : Varalakshmi Vratam | హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. తెలుగు క్యాలెండర్లో ఐదవది అయిన ఈ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం, దేవాలయాలు భక్తులతో కళకళలాడుతూ ఉంటాయి. వివాహిత మహిళలకు ఈ నెల చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా శ్రావణ శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకునే వరలక్ష్మీ వ్రతం(Varalakshmi Vratam) అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్టలక్ష్ములను పూజించినంత ఫలితం దక్కుతుందని నమ్మకం. ఈ పర్వదినాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రతం విశేషాలు
వరలక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు సతీమణి. ఈమె వరాలను ప్రసాదించే తల్లిగా పూజిస్తారు. వరలక్ష్మీ వ్రతం పాపాలను తొలగించి, లక్ష్మీదేవి(Laksmi Devi) అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఈ వ్రతం ఆచరించడం వల్ల ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలుగుతాయి. వరలక్ష్మీ వ్రతాన్ని ముఖ్యంగా సుమంగళి మహిళలు నిర్వహిస్తారు. తద్వారా వారు దీర్ఘకాలం సుమంగళిగా ఉండే వరాన్ని పొందుతారు. ఒకవేళ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వ్రతం చేయడం సాధ్యం కాకపోతే, ఆ మాసంలో వచ్చే ఏ శుక్రవారమైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే, శ్రావణ మాసం(Shravana Masam)లో రెండో శుక్రవారానికి ప్రాముఖ్యత ఎక్కువ.
వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి
పూజకు కావలసిన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
పూజాద్రవ్యాలు: పసుపు, కుంకుమ, గంధం, పూల మాలలు, విడిపూలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగర్బత్తి, కర్పూరం, చిల్లర నాణేలు, కొబ్బరికాయలు, పండ్లు, మామిడి ఆకులు, కలశం.
నైవేద్యం: రెండు రకాల స్వీట్లు, బియ్యం, పంచామృతం లేదా పాలు.
ఇతర వస్తువులు: పసుపు రాసిన తోరం, దీపాలు, దీపపు కుందులు, నూనె, వత్తులు, హారతికి కావలసిన సామాగ్రి, ఒక తెల్లటి వస్త్రం, రెండు రవికె వస్త్రాలు, అమ్మవారి ఫోటో, బియ్యపు పిండి.
Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత పూజా విధానం
వ్రతం రోజు ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసి, బియ్యపు పిండితో ముగ్గు వేసి, అమ్మవారి ఫోటోను లేదా కలశాన్ని ఉంచాలి.
తోరం తయారు చేయడం
తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులుగా చేసి, పసుపు రాసుకోవాలి. ఈ దారానికి ఐదు లేదా తొమ్మిది పువ్వులు కట్టి, ముడులు వేయాలి. ఇలా తయారు చేసుకున్న తోరాలను పూజా పీఠం వద్ద ఉంచి, అక్షతలు, పసుపు, కుంకుమలతో పూజించాలి.
గణపతి పూజ
ఏ శుభకార్యానికైనా విఘ్నాలు కలగకుండా ముందుగా గణపతి(Ganapathi)ని పూజించడం ఆచారం. “వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ…” వంటి శ్లోకాలతో పసుపు గణపతిని పూజించాలి. పుష్పాలు, ధూపం, దీపం, బెల్లం లేదా పండ్లతో నైవేద్యం సమర్పించి, అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి.
కలశ పూజ
గణపతి పూజ తర్వాత కలశంపై పువ్వులు లేదా అక్షతలతో పూజ చేయాలి. “కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితాః…” అనే శ్లోకంతో కలశంలోని నీటిని భగవంతుడిపై, పూజా ద్రవ్యాలపై, తలపై చల్లుకోవాలి.
అష్టోత్తర శతనామావళి
వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో, పుష్పాలతో అంగపూజ చేయాలి. ఆ తరువాత “శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి” చదువుతూ అమ్మవారిని పూజించాలి.
తోర పూజ & కథాశ్రవణం
తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి, అక్షతలతో పూజించాలి. పూజ అనంతరం, ఈ క్రింది శ్లోకాలు చదువుతూ తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి.
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
తర్వాత, శివుడు పార్వతికి ఉపదేశించిన చారుమతి వ్రత కథను వినాలి. కథ పూర్తయ్యాక అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి.
వ్రత సమాప్తి
పూజ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు పంచి, వ్రతం చేసినవారు వాటిని స్వీకరించాలి. రాత్రిపూట ఉపవాసం ఉండి, నిశ్చలమైన భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తే వరాలందించే ఆ తల్లి కరుణ లభిస్తుంది. ఈ వ్రతం ఆచరించడానికి కఠిన నియమాలు అవసరం లేదు, కేవలం నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు.
Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రతం వల్ల కలిగే లాభాలు
ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి, కేవలం ధన సంపదే కాకుండా, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద వంటి సకల సంపదలు లభిస్తాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అని కూడా అర్థం. అందుకే ఈ వ్రతం సర్వశుభాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. ఈ పర్వదినం అందరికీ సుఖశాంతులను, ఐశ్వర్యాన్ని అందించాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.