అక్షరటుడే, నిజమాబాద్ సిటీ : Uttam Kumar Reddy | సామాన్య కార్యకర్త మేయర్గా ఎంపిక కావడం సంతోషంగా ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కూరగాయల ఉమారాణి మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (Congress Party Office)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Uttam Kumar Reddy | నిరుపేదను మేయర్గా..
నిరుపేదను మేయర్ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనకు రెఫరెండంగా ఈ ఫలితాలు నిలిచాయన్నారు. రాష్ట్రంలో 80 నుంచి 90శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలుచుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ (Telangana)లో రెండేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ జరగడం లేదన్నారు.
పంచాయతీ ఎన్నికల్లోనూ జయకేతనం..
పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్ల తీర్పు, మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) పట్టణ ప్రజల తీర్పు కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చిందన్నారు. అర్బన్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మా అభ్యర్థులు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానన్నారు. నిజామాబాద్ నగరంలో గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Corporation)తో పాటు అన్ని మున్సిపాలిటీలను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు.
అభివృద్ధి కోసం..
ఆదరించి గెలిపించిన నిజామాబాద్ పట్టణ ప్రజలకు పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమార్ గౌడ్ (Bomma Mahesh Kumar Goud) ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో నిజామాబాద్లో మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నామన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత నిజామాబాద్ మేయర్ సీటు గెలుచుకున్నామన్నారు. పండ్లు విక్రయించే స్థాయి నుంచి మేయర్గా ఎదిగిన ఉమారాణికి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. కులం మతం పేరుతో రెచ్చగొట్టినా ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి మేయర్ అయితే జిల్లా మేటి నగరంగా మారుతుందని ప్రజలు ఆశీర్వదించారన్నారు. సెంటిమెంట్ రాజేసి ఉసిగొల్పడం వల్ల దాదాపు 7 సీట్ల వరకు స్వల్ప మెజారిటీతో కోల్పోవాల్సి వచ్చిందని పీసీసీ చీఫ్ అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం మీద పోటీచేసి 5 సీట్లు గెలుచుకున్నామని చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం ఎంఐఎంతో కలిశామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సదారులు సుదర్శన్ రెడ్డి నగర నూతన మేయర్ కూరగాయల ఉమారాణి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.