Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Police | త్వరలో స్టేషన్ల అప్​గ్రేడ్​.. వెలువడనున్న ఉత్తర్వులు

Nizamabad Police | త్వరలో స్టేషన్ల అప్​గ్రేడ్​.. వెలువడనున్న ఉత్తర్వులు

Nizamabad Police | జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లు త్వరలో అప్​గ్రేడ్​ కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad Police | నిజామాబాద్​ కమిషనరేట్ (Nizamabad Commissionerate)​ పరిధిలో పలు పోలీస్​ స్టేషన్లు అప్​గ్రేడ్​ కాబోతున్నాయి. ప్రస్తుతం సబ్​ ఇన్​స్పెక్టర్లు ఎస్​హెచ్​వోలుగా (స్టేషన్​ హౌస్​ ఆఫీసర్​) వ్యవహరిస్తున్న పలు స్టేషన్లు.. ఇన్​స్పెక్టర్లు ఎస్​హెచ్​వోలుగా (SHO) వ్యవహరించే స్థాయికి అప్​గ్రేడ్​ కానున్నాయి. ఇప్పటికే కమిషనరేట్​ అధికారులు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించారు. దీనికి ప్రభుత్వం అతి త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​గా మారినప్పటికీ స్టేషన్ల అప్​గ్రేడ్​ మాత్రం జరగలేదు. శాంతి భద్రతల పర్యవేక్షణ, పరిపాలన సౌలభ్యంలో భాగంగా కమిషనరేట్​ పరిధిలో ఉన్న స్టేషన్లకు ఇన్​స్పెక్టర్​ స్థాయి అధికారులు ఎస్​హెచ్​వోలు ఉంటారు. 2016లో నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​గా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఠాణాను కూడా అప్​గ్రేడ్​ చేయలేదు. వాస్తవానికి పోలీస్​ స్టేషన్లను అప్​గ్రేడ్​ చేయాలని అధికారులు పంపిన ప్రతిపాదనలు ఏళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్​లో ఉన్నాయి. కాగా.. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాలు, తాజాగా కానిస్టేబుల్​ హత్య ఉదంతం ఘటన నేపథ్యంలో స్టేషన్ల అప్​గ్రేడ్​ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Nizamabad Police | ఓకే చెప్పిన డీజీపీ

రాష్ట్ర డీజీపీ శివధర్​రెడ్డి (DGP Shivadhar Reddy), ఇంటెలిజెన్స్​ అడిషనల్​ డీజీ విజయ్​ మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. రౌడీ షీటర్​ రియాజ్​ చేతిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్​ ప్రమోద్ (Constable Pramod)​ కుటుంబాన్ని వారు పరామర్శించారు. అనంతరం కమిషనరేట్​ కార్యాలయంలో పలు కీలక విషయాలపై ఐజీ చంద్రశేఖర్​రెడ్డి, సీపీ సాయి చైతన్యతో (CP Sai Chaitanya) కలిసి చర్చించారు. ఇదే సమయంలో స్టేషన్ల అప్​గ్రేడ్​ పెండింగ్​ విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రతిపాదనలు పంపిన మేరకు స్టేషన్లను అప్​గ్రేడ్ చేసేందుకు డీజీపీ, ఇంటెలిజెన్స్​ అడిషనల్​ డీజీ ఓకే చెప్పారని తెలిసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

Nizamabad Police | అప్​గ్రేడ్​ అయ్యే స్టేషన్లు ఇవే..

జిల్లాలో ఎస్​హెచ్​వోలుగా అప్​గ్రేడ్​ అయ్యే స్టేషన్లలో నగరంలోని నాలుగో టౌన్​ ఠాణా మొదటి వరుసలో ఉంది. ఈ స్టేషన్​ పరిధిలో మొదటి నుంచి క్రైమ్​ రేట్​ ఎక్కువ. స్టేషన్​ పరిధి కూడా ఎక్కువే. అలాగే నిజామాబాద్​ రూరల్ స్టేషన్​ కూడా ఎస్​హెచ్​వోగా అప్​గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఆర్మూర్​, బాల్కొండ, బోధన్​, నిజామాబాద్​ రూరల్ ​ పరిధిలోని ఒక్కో స్టేషన్​ చొప్పున అప్​గ్రేడ్​ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కమిషనరేట్​ పరంగా పోలీస్​ కమిషనర్​కు ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించి నాలుగో టౌన్, రూరల్​ స్టేషన్లకు ఇన్​స్పెక్టర్లను ఎస్​హెచ్​వోలుగా నియమించే అవకాశాలు ఉన్నాయి.