అక్షరటుడే, వెబ్డెస్క్ :Manas Sarovar Yatra | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh Government) కీలక నిర్ణయం తీసుకుంది. కైలాస్ మానససరోవర యాత్ర (Kailash Manasarovar Yatra) చేపట్టే యాత్రికులకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది యాత్రికులకు ఆర్థికంగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ ఆర్థిక సహాయం ఉత్తరప్రదేశ్కు చెందిన స్థానికులకి మాత్రమే వర్తిస్తుంది. వారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మార్గంలో యాత్ర చేసిన లేదా ప్రైవేటు మార్గంలో యాత్ర చేపట్టినా సరే, ఈ సాయం అందుబాటులో ఉంటుంది. యాత్ర ముగిసిన తర్వాత 90 రోజుల లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Manas Sarovar Yatra | ఎలా అంటే..
వెబ్సైట్ www.updharmarthkarya.in లో దరఖాస్తు ఫారమ్ అందుబాటులో ఉంటుంది. అందుకు అవసరమైన పత్రాలు, తాజా ఫొటో, ఆధార్, పాన్ కార్డు, డోమిసైల్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, యాత్ర పూర్తి చేసిన సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ వివరాలతో కూడిన దరఖాస్తును కేవలం ఆన్లైన్లో మాత్రమే పంపాలి. తప్పుడు పత్రాలు సమర్పించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకున్న మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తారు.
యాత్రలో మరణించిన యాత్రికుడి కుటుంబ సభ్యులు (భార్య/భర్త లేదా సొంతవారు) కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చర్య ద్వారా రాష్ట్ర ప్రభుత్వం (state government) ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవిస్తూ, వారిని ప్రోత్సహించే దిశగా అడుగులు వేసినట్లు చెప్పవచ్చు. కైలాస్ మానససరోవర యాత్ర అనేది హిందూ, బౌద్ధ, జైన్ మతాలలో అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటి. దీనిపై ప్రభుత్వం చూపించిన సహకారం యాత్రికుల్లో ఆశాభావాన్ని పెంచుతుంది.
ఐదేళ్ల విరామం తర్వాత కైలాస మానస సరోవర యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈసారి మొత్తం 720 మంది భక్తులు ఈ పుణ్యయాత్రలో పాల్గొననున్నారు. వీరితో పాటు 30 మంది లైజన్ అధికారులు కూడా ఉండనున్నారని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి Corona కారణంగా 2020 నుంచి మానస సరోవర యాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే. చైనా ప్రభుత్వం నుంచి యాత్రకు సంబంధించి సరైన సమాచారం లేకపోవడం కూడా ఇందుకు కారణమైంది. జూన్ మూడవ వారం నుండి యాత్ర మొదలయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 25వ తేదీతో ఈ యాత్ర ముగియనుంది.