అక్షరటుడే, వెబ్డెస్క్ : TTD Chairman | టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐదు వేల ఆలయాలు, భజన మందిరాలను ఎస్టీ, ఎస్సీ, బీసీ కాలనీల్లో నిర్మిస్తామని తెలిపింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) మీడియాకు వివరాలు వెల్లడించారు.
టీటీడీ నిర్వహిస్తున్న ఆలయాల్లో నిరంతరాయంగా అన్నదానం వితరణ చేపడుతామన్నారు. 37 కోట్లతో ఒంటిమిట్టలో 100 గదులు నిర్మిస్తామని ఆయన తెలిపారు. అలాగే టీటీడీ గోశాలలో నిర్వహణ సరిగ్గా లేదని బోర్డుకు దృష్టికి వచ్చిందని చెప్పారు. దీనిపై సబ్ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అద్దెగదుల మధ్య టారిఫ్ వ్యత్యాసాలపై సబ్ కమిటీ వేశామన్నారు.
TTD Chairman | కరీంనగర్లో శ్రీవారి ఆలయం
కరీంనగర్ (Karimnagar)లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. రూ.30 కోట్ల ఆలయం నిర్మిస్తామని ఛైర్మన్ తెలిపారు. ఇందులో రూ.10 కోట్లు దాతలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే కాణిపాకం ఆలయం వద్ద రూ.25 కోట్లతో టీటీడీ కల్యాణ మండపం నిర్మిస్తామన్నారు.
TTD Chairman | ఏసీబీ విచారణకు..
పర్చేజింగ్ కమిటీలో ఉన్న ఉద్యోగులు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ విచారణ (ACB investigation) చేయాలని తీర్మానం చేసినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. వేదిక్ యూనివర్సిటీ వీసీగా రాణి సదాశివమూర్తిని తొలగించామన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజులు నిర్వహిస్తామన్నారు.
TTD Chairman | కార్తీక బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. నవంబరు 17 నుంచి 25 వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుందన్నారు. 16న లక్షకుంకుమార్చన, అంకురార్పణ నిర్వహిస్తారని చెప్పారు. 17న ధ్వజారోహణం, 21న గజ వాహనం, 22న స్వర్ణరథం, గరుడ వాహనం, 24న రథోత్సవం, 25న పంచమితీర్థం, 26న పుష్పయాగం నిర్వహిస్తారని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.

