అక్షరటుడే, వెబ్డెస్క్: Baba Ramdev | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వివిధ దేశాలపై విధిస్తున్న సుంకాలను ప్రముఖ యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ (Baba Ramdev) ఆదివారం తీవ్రంగా ఖండించారు. ట్రంప్ చేస్తున్న ఆర్థిక యుద్ధాన్ని టారిఫ్ టెర్రరిజంగా (Tariff terrorism) అభివర్ణించారు. స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయడమే ట్రంప్ ఆర్థిక యుద్ధానికి సరైన సమాధానం అవుతుందా అంటూ మీడియా అడిగిన ప్రశ్నపై రామ్దేవ్ స్పందించారు.
స్వదేశీ (Swadeshi) తత్వం అందరినీ కలిపి ఎదగడమేనన్నారు. అమెరికా ప్రస్తుతం చూపిస్తున్న ‘విస్తరణవాద’, ‘సామ్రాజ్యవాద’ ధోరణులకు ఇది భిన్నమన్నారు. సమష్టిగా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవసరమైన విధానంగా స్వదేశీని పేర్కొన్నారు. ‘‘సుంకం అంటే టెర్రరిజం, ఇది చాలా ప్రమాదకరం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మూడో ప్రపంచ యుద్ధం ఉంటే అది ఈ ఆర్థిక యుద్ధమే.. ఇందులో కనీసం పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల గురించైనా ఆలోచించాలి. అధికారంలో ఉన్నవారు ఇంత సామ్రాజ్యవాద, విస్తరణవాద ధోరణి చూపడం, అహంకారం చూపడం మంచిది కాదు’’ అని రాందేవ్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Baba Ramdev | అందరినీ కలుపుకుని వెళ్లాలి..
ప్రపంచంలో కొందరు వ్యక్తుల చేతుల్లో అధికారం కేంద్రీకృతమవుతోందని రాందేవ్ పేర్కొన్నారు. ఇలాంటి వ్యవస్థ అసమానత (Inequality), అన్యాయం, దోపిడీ, సంపదను (Wealth) పెంచి సమృద్ధిని అడ్డుకుంటుందని పేర్కొన్నారు. ‘‘ప్రతి ఒక్కరూ తమ హద్దుల్లో ఉండాలి. అందరినీ కలిపి ఎదగడం అనే సంప్రదాయాన్ని కొనసాగించాలి. కొందరు మాత్రమే ప్రపంచ అధికారం, సంపద, సమృద్ధి, బలాన్ని నియంత్రిస్తే.. అసమానత, అన్యాయం (Injustice), దోపిడీ, సంఘర్షణ, రక్తపాతం ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తాయి’’ అని హెచ్చరించారు. స్వదేశీ అనే నినాదం ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంసమృద్ధి సాధించడమేనని అభివర్ణించారు.
తమ పతంజలి ఆయుర్వేద సంస్థ ఆయుర్వేద ఔషధాలు, సౌందర్య సాధనాలు, ఆహార ఉత్పత్తులను తయారు చేస్తుందని, తమ ఉత్పత్తులు అమెరికాకూ ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. పతంజలి యోగపీఠ్ (Patanjali Yogpeeth) యూఎస్లో రిజిస్టర్డ్ చారిటీగా, వెల్నెస్ సెంటర్గా కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. మహర్షి దయానంద్, స్వామి వివేకానంద (Swami Vivekananda) వంటి మహానుభావులు స్వదేశీని సమర్థించారని గుర్తు చేశారు. ‘‘స్వదేశీ అంటే స్వయం సమృద్ధి, స్వావలంబన (self-reliance), చివరి వ్యక్తి ఉద్ధరణ. మహర్షి దయానంద్ (Maharishi Dayanad) నుంచి వివేకానంద వరకు అనేకమంది మహానుభావులు దీనికి ప్రతినిధులు. అందరూ ఎదగాలి, నీతో పాటు నీ చుట్టూ ఉన్నవారిని, పర్యావరణాన్ని ఉద్ధరించు – ఇదే స్వదేశీ మూలం’’ అని రాందేవ్ వివరించారు.
