అక్షరటుడే, వెబ్డెస్క్ : Donald Trump | సుంకాల విధింపు తర్వాత భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో కలిసే ఉన్నామని ట్రంప్ చెప్పారు .
అయితే, చైనాలో ప్రధాని మోదీ(PM Modi), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin), చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్(Chinese President Xi Jinping)తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇండియా మాత్రం తమపై భారీగా పన్నులు విధిస్తోందని అమెరికా అధ్యక్షుడు మరోసారి విమర్శించారు. ఓవల్ కార్యాలయం(Oval Office)లో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. అమెరికా భారత భాగస్వామ్యం సంవత్సరాలుగా ఏకపక్షంగా ఉందని, ఎందుకంటే న్యూఢిల్లీ అమెరికా వస్తువులపై ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను వసూలు చేస్తుంది, ఇది అసమతుల్య వాణిజ్య పరిస్థితిని సృష్టిస్తుందన్నారు. ఇండియాపై సుంకాలు తగ్గించే ఆలోచన లేదని చెప్పారు.
Donald Trump | మాపై సుంకాలు విధిస్తున్నారు..
భారత్తో సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ, వారు తమపై భారీగా పన్నులు విధిస్తున్నారని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. “మేము భారతదేశంతో చాలా బాగా కలిసిపోతాము. కానీ వారు చాలా సంవత్సరాలుగా మాపై వంద శాతం పన్నులు మోపుతున్నారు. భారత్తో వాణిజ్యం ఏకపక్షంగా సాగుతోంది. ఇండియా మా నుండి విపరీతమైన సుంకాలను వసూలు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా పన్నులు విధించారు. అదే సమయంలో మేము వారితో వ్యాపారం చేయడం లేదు, కానీ వారు మాతో వ్యాపారం చేస్తున్నారు ఎందుకంటే మేము వారి నుంచి మూర్ఖంగా వసూలు చేయడం లేదు… అందుకే వారు తయారు చేసిన ప్రతిదాన్ని పంపించి దేశానికి తరలించారు. వారు మా నుండి 100 శాతం సుంకాలను వసూలు చేస్తున్నందున మేము ఏమీ పంపమని” తెలిపారు.
Donald Trump | ఆ కంపెనీలు పిలిపిస్తున్నాం..
ట్రంప్ తన వాదనకు మద్దతుగా హార్లే డేవిడ్సన్(Harley Davidson) ను ఉదాహరించారు. అమెరికాలో అత్యంత గుర్తింపు పొందిన మోటార్ సైకిల్ బ్రాండ్లలో ఒకటైన హార్లే-డేవిడ్సన్ భారతదేశంలో తన ఉత్పత్తులను అమ్మడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను నొక్కి చెప్పారు. “మోటార్ సైకిల్ పై 200 శాతం సుంకం ఉండటంతో హార్లే డేవిడ్సన్ భారతదేశంలో అమ్మకాలు జరపలేకపోయింది… హార్లే డేవిడ్సన్ భారతదేశానికి వెళ్లి మోటార్ సైకిల్ ప్లాంట్(Motorcycle Plant) నిర్మించింది, ఇప్పుడు వారు సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదు” అని తెలిపారు. అన్యాయమైన సుంకాల విధానాలు ఆయా కంపెనీలను అమెరికా వెలుపల ఉత్పత్తిని తరలించేలా చేశాయని ఎత్తి చూపారు.
అయితే, తమ వాణిజ్య విధానాలు, అధిక పరస్పర సుంకాల విధింపుతో సహా, ఈ ధోరణిని తిప్పికొట్టడం ప్రారంభించాయని పేర్కొన్నారు. “ఇప్పుడు వేలాది కంపెనీలు యుఎస్ లోకి వస్తున్నాయి… సాంప్రదాయకంగా, కార్ల కంపెనీలు… వారు చైనా, మెక్సికో, కెనడా నుంచి తిరిగి వచ్చేస్తున్నారు… వారు ఇక్కడ ప్లాంట్లను నిర్మించాలనుకుంటున్నారు ఎందుకంటే అధిక సుంకాల నుంచి వారిని రక్షించుకునేందుకు. వారు సుంకాలు చెల్లించకుండా ఉండాలని కోరుకుంటారు. ఇక్కడ వారి కార్లను తయారుచేస్తే ఎటువంటి సుంకాలు ఉండవు” అని ఆయన తెలిపారు.