అక్షరటుడే, వెబ్డెస్క్ : Donald Trump | భారత్పై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని సూచించారు. లేకపోతే మరిన్ని చర్యలు తప్పవని హెచ్చరించారు.
వైట్ హౌస్లో (White House) పోలిష్ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడిన ట్రంప్ ఫేజ్-2, 3 చర్యలు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. రష్యా నుంచి చమురు కొంటున్నారన్న కారణాన్ని చూపుతూ అమెరికా ఇప్పటికే భారత్పై 50 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దేశ ఇంధన అవసరాలతో పాటు ప్రపంచ ఇంధన ధరల స్థిరీకరణ దృష్ట్యా తక్కువ ధరకే లభిస్తున్న రష్యా (Russia) నుంచి కొనుగోలు చేస్తోంది. మాస్కో నుంచి అత్యధికంగా ఇంధన కొనుగోలు చేస్తున్న దేశంగా ఇండియా నిలిచింది. దాదాపు 35 శాతం వరకూ అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి హెచ్చరించారు.
Donald Trump | మరిన్ని చర్యలు తప్పవు..
మాస్కో నుంచి ఇంధన దిగుమతులను కొనసాగిస్తే న్యూఢిల్లీ (New Delhi) మరిన్ని జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. అమెరికా ఇంకా ఫేజ్-2, ఫేజ్-3 సుంకాలను విధించలేదన్నారు. రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్న దేశాలపై అమెరికా ఇంకా ఫేజ్-2, ఫేజ్-3 సుంకాలను విధించలేదని హెచ్చరించారు. అయితే, రష్యాపై ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించగా.. భారతదేశంపై ద్వితీయ ఆంక్షలు విధించడం రష్యాపై ప్రత్యక్ష చర్య అని అన్న ట్రంప్.. దీని వల్ల రష్యాకు వందల బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని తెలిపారు.
భారత్పై సుంకాలు రష్యాపై ప్రత్యక్ష చర్యగానే పరిగణించాలన్నారు. “చైనా తర్వాత అతిపెద్ద కొనుగోలుదారు అయిన భారతదేశంపై (India) ద్వితీయ ఆంక్షలు విధించడం దాదాపు సమానంగా ఉంటుందని మీరు చెబుతారా? ఎటువంటి చర్య లేదని మీరు చెబుతారా? దాని వల్ల రష్యాకు వందల బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి, మీరు దానిని చర్య తీసుకోలేదని అంటారా? నేను ఇంకా దశ-2 లేదా దశ-3 చేయలేదు” అని తెలిపారు. రష్యా చమురు కొనుగోళ్లను కొనసాగిస్తే భారతదేశం పెద్ద సమస్యలను ఎదుర్కొంటుందని తాను గతంలో చేసిన హెచ్చరికను అమెరికా అధ్యక్షుడు గుర్తు చేశారు. “భారతదేశానికి పెద్ద సమస్యలు తప్పవని నేను రెండు వారాల క్రితం చెప్పాను. అదే జరుగుతుంది” అని ట్రంప్ వివరించారు.