అక్షరటుడే, వెబ్డెస్క్ : Donald Trump | పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్(Hamas)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి హెచ్చరిక జారీ చేశారు. గాజాలో ఉంచిన బందీలను విడుదల చేయడానికి ఒక ఒప్పందానికి రావాలని డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్ (Israel) ఇప్పటికే తన నిబంధనలను అంగీకరించిందని, హమాస్ కూడా ఒప్పందానికి ముందుకు రావాలని సూచించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పోస్ట్ హెచ్చరించారు. “ఇజ్రాయెల్ నేతలు నా నిబంధనలకు అంగీకరించారు. హమాస్ కూడా అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది” అని ట్రంప్ (Donald Trump) రాసుకొచ్చారు. “ఒప్పందానికి రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇది నా చివరి హెచ్చరిక, మరొకటి ఉండదు” అని ఆయన స్పష్టం చేశారు.
2023 అక్టోబర్ ప్రారంభంలో హమాస్ ఇజ్రాయిల్పై అనూహ్య దాడి చేసి వందలాది మందిని హతమార్చింది. అలాగే, 400 మంది దాకా బందీలుగా తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ గాజాపై దాడులకు దిగింది. దాదాపు రెండెళ్లుగా కొనసాగుతున్న ఈ సంక్షోభాన్ని ముగించేందుకు అమెరికా సహా పలు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. గతంలో జరిగిన చర్చల ఫలితంగా కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. అయితే, ఇరుపక్షాలు కాల్పుల విరమణను ఉల్లంఘించడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇజ్రాయిల్ మరోసారి సైనిక చర్య చేపట్టింది. ఆ దేశంతో పాటు పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ట్రంప్ తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు. శాంతి ఒప్పందానికి ముందుకు రావాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
Donald Trump | ఇజ్రాయిల్పై రాకెట్లతో దాడి..
మరోవైపు, ఇరు పక్షాలు పరస్పర దాడులతో గాజా స్ట్రిప్(Gaza Strip) గడగడలాడుతోంది. మరోవైపు, ఆదివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి రెండు రాకెట్లు ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గాజా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెటివోట్(Netivot) పట్టణం సమీపంలో ఇవి పడ్డాయి. అయితే, ఎవరు గాయపడలేదని, ఆస్తినష్టం జరగలేదని తెలిపింది.