అక్షరటుడే, వెబ్డెస్క్ : Trump India Pakistan War | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్- పాక్ మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపానని పేర్కొన్నారు. లేదంటే పాకిస్థాన్లో 35 మిలియన్ల జనం చనిపోయేవారన్నారు.
స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడారు. భారతదేశం-పాకిస్తాన్ సైనిక ఘర్షణతో సహా “ఎనిమిది యుద్ధాలను ఆపానని” పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భారత్ పాక్పై విరుచుకుపడింది. పాకిస్థాన్ డీజీఎంవో (DGMO) అభ్యర్థన మేరకు సీజ్ఫైర్కు అంగీకరించింది. అయితే ట్రంప్ మాత్రం తానే యుద్ధాన్ని ఆపానని గతంలో సైతం చెప్పారు. భారత్ ఈ వ్యాఖ్యలను ఖండించింది. తాజాగా మరోసారి ట్రంప్ తాను లేకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేదని చెప్పారు. 35 మిలియన్ల మంది ప్రాణాలను కాపాడారని పాకిస్థాన్ ప్రధాన మంత్రి తనకు చెప్పారన్నారు.
Trump India Pakistan War | 8 యుద్ధాలు ఆపాను
తన మొదటి 10 నెలల్లో ఎనిమిది యుద్ధాలను ముగించానని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి స్టేట్ ఆఫ్ యూనియన్ (State Of Union)లో ప్రసంగించారు. ఇజ్రాయెల్– హమాస్, ఇజ్రాయెల్ –ఇరాన్, ఈజిప్ట్ –ఇథియోపియా, భారత్–పాక్, సెర్బియా– కొసావో, రువాండా –కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, అర్మేనియా –అజర్బైజాన్, కంబోడియా –థాయిలాండ్ దేశాల మధ్య యుద్ధాలను ఆపానని తెలిపారు. ట్రంప్ చేసిన వాదనలను గతంలో భారతదేశం పదే పదే ఖండించింది. సంఘర్షణను ఆపడంలో ట్రంప్ పాత్ర గురించి అడిగినప్పుడు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా “అమెరికాలో ఉంది” అని వ్యంగ్యంగా అన్నారు.
Trump India Pakistan War | దానికి అనుమతించను
ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద స్పాన్సర్ ఇరాన్ (Iran) అని ట్రంప్ అన్నారు. ఆ దేశం అణ్వాయుధాన్ని పొందేందుకు తాను అనుమతించబోనని పేర్కొన్నారు. సుంకాలపై ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పును చాలా దురదృష్టకరం అని, నిరాశపరిచేది అని ఆయన అభివర్ణించారు. ఇలాంటి సుంకాలను విధించడానికి ప్రత్యామ్నాయ చట్టపరమైన విధానాలను ఉపయోగిస్తామని స్పష్టం చేశారు.
