Homeతాజావార్తలుCold Wave | వణికిస్తున్న చలి.. మరో నాలుగు రోజులు జాగ్రత్త అంటున్న అధికారులు

Cold Wave | వణికిస్తున్న చలి.. మరో నాలుగు రోజులు జాగ్రత్త అంటున్న అధికారులు

రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cold Wave | శీతాకాలం ప్రారంభంలోనే చలి వణికిస్తోంది. రాష్ట్రంలో నవంబర్​1 నుంచి చలి కాలం ప్రారంభం అవుతుంది. అయితే ఈ ఏడాది నవంబర్​ 5 వరకు సైతం వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత నుంచి చలి ప్రభావం మొదలైంది.

రాష్ట్రంలో సాధారణంగా డిసెంబర్​, జనవరి నెలల్లో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు అవుతుంటాయి. చలి తీవ్రత ఆ సమయంలోనే అధికంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది మాత్రం నవంబర్​ 6 నుంచే చలి వణికిస్తోంది. ముఖ్యంగా నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సాయంత్రం ఆరు అయిందంటే చాలు.. బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం పది గంటల వరకు కూడా చలిపెడుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Cold Wave | సిర్పూర్​లో 7.1 డిగ్రీలు

రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా (Adilabad District)లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్​లో బుధవారం తెల్లవారుజామున 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. తిర్యానిలో 8.2 డిగ్రీలు నమోదు అయింది. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు చలిగాలులతో వణికిపోతున్నాయి. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో సైతం దీని ప్రభావం అధికంగా ఉంది. నగరంలోని శేరిలింగంపల్లిలో 11.8, రాజేంద్రనగర్​లో 12.9, మారేడ్​పల్లిలో 13.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న నాలుగు రోజులు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Cold Wave | జాగ్రత్తగా ఉండాలి

చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో ప్రయాణాలు చేయకపోవడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై రాత్రిపూట జర్నీ చేయకపోవడం ఉత్తమం. బయటకు వెళ్లాల్సి వస్తే స్వెటర్లు, క్యాప్​లు, చేతులకు గ్లౌస్​లు పెట్టుకోవాలి. చలి ప్రభావంతో జలుబు, దగ్గు, జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు జ్వరం వచ్చే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు సైతం చలికి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. ముఖ్యంగా ఆస్తమా రోగులు తగిన జాగ్రత్తలు పాటించాలి.

Must Read
Related News