అక్షరటుడే, వెబ్డెస్క్ : Medak | మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళకు పని ఇస్తామని చెప్పి తీసుకెళ్లి దుండగులు అత్యాచారం చేశారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ, ఆమె భర్త అడ్డా కూలీలుగా పని చేస్తూ జీవిస్తున్నారు. సదరు మహిళ నిత్యం గ్రామం నుంచి మెదక్కు పని కోసం వస్తుంటుంది. శుక్రవారం సైతం ఆమె పనికి రాగా.. కొందరు వ్యక్తులు పని ఇప్పిస్తామని నమ్మించారు. అనంతరం ఆమెను ఏడుపాయల (Edupayala) శివారులోని ఓ వెంచర్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు.
Medak | రాత్రంతా కొనఊపిరితో..
నిందితులు ఆమెను అత్యాచారం చేసి, రాళ్లతో దాడి చేశారు. చేతులను స్తంభానాకి కట్టేశారు. అనంతరం చనిపోయిందనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ మహిళ శుక్రవారం రాత్రి కొన ఊపిరితో వెంచర్లో కొట్టుమిట్టాడింది. శనివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఆమెను మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి హైదరాబాద్ తరలిస్తుండగా ఆమె మార్గమధ్యలో మృతి చెందింది.
Medak | దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మహిళ హత్యాచారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమర్ (DSP Prasanna kumar) ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ మహిళ వెళ్లిన మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.