అక్షరటుడే, వెబ్డెస్క్: Tiger | కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రైతులు, ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దోమకొండ మండలంలోని (Domakonda Mandal) అంబారిపేట శివారులో దూడలపై పెద్దపులి దాడి చేసినట్లు అక్కడి రైతులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి డబుల్ బెడ్ రూం సముదాయం నుంచి మాందాపూర్ వెళ్లేదారిలో ఆకుతోట రామచంద్రం వ్యవసాయ క్షేత్రంలో మరోమారు పులి సంచారం ఆందోళనకు గురిచేసింది. సోమవారం రాత్రి ఓ ఆవుపై దాడి చేసి చంపేసినట్లు రైతులు తెలిపారు. అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
Tiger | దూడలపై దాడిచేసి..
పెద్దపులి సంచరించిన ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు (Forest Officers) అటవీ ప్రాంతంలో ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ట్రాక్ కెమెరాలో పెద్దపులి కదలికలు స్పష్టంగా రికార్డు అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.
Tiger | ఆందోళనలో స్థానికులు..
పెద్దపులి సంచారంతో పశువుల కాపరులు, వ్యవసాయ పనులు చేసుకునే వారు పొలాల వైపు వెళ్లడానికి భయపడిపోతున్నారు. రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు రావొద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. గత జులై నెలలో రెడ్డిపేట తండా శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పెద్దపులిపై విషప్రయోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు కూడా తరలించారు.
ఉభయ జిల్లాల అటవీశాఖ అధికారులు ఆపరేషన్ టైగర్ (Operation Tiger) పేరిట పెద్దపులి కోసం జల్లెడ పట్టినా దాని జాడ కనిపించలేదు. కాగా, పెద్దపులి క్షేమంగా వేరే ప్రాంతానికి చేరి ఉంటుందని తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మళ్లీ ఐదు నెలల తర్వాత పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.