అక్షరటుడే, వెబ్డెస్క్ : Cabinet Expansion | రాష్ట్రంలో ఎంతోకాలంగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) ఎట్టకేలకు పూర్తయింది. కాంగ్రెస్ (Congress) అధిష్టానం నిర్ణయం మేరకు ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. సామాజిక సమీకరణాలు, రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకొని ముగ్గురికి అవకాశం కల్పించారు. మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్, బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్వర్మ (Governor Jishnu Dev Varma) వీరితో వరుసక్రమంలో ప్రమాణ స్వీకారం చేయించారు. తాజాగా మంత్రులుగా ప్రమాణం చేసిన వారు ముగ్గురికీ గతంలో ఎప్పుడూ కేబినెట్లో పనిచేసిన అనుభవం లేకపోవడం గమనార్హం.
Cabinet Expansion | రాజకీయ కుటుంబం నుంచి వచ్చి..
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ (Gaddam Vivek) తాజాగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. కాంగ్రెస్లో వివిధ హోదాల్లో పని చేసిన గడ్డం వెంకట్స్వామి(కాకా) కుమారుడైన వివేక్ 2009లో కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీ (Peddapalli MP)గా గెలుపొందారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో బాల్క సుమన్(బీఆర్ఎస్) చేతిలో ఓడిపోయారు. అనంతరం కొంతకాలానికి ఆయన బీఆర్ఎస్(BRS)లో చేరారు. తర్వాత ఆ పార్టీలో ఇమడలేక బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ కూడా ఉండలేక అసెంబ్లీ ఎన్నికల ముందు వివేక్ సొంతగూటికి చేరారు.
కాంగ్రెస్లో చేరే సమయంలోనే ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు తాజాగా మంత్రివర్గంలో చోటు కల్పించారు. గతంలో ఆయన కేంద్ర బొగ్గు, ఉక్కు కమిటీలో సభ్యుడిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అంతర్రాష్ట్ర సంబంధాల సలహాదారుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా వివేక్ సోదరుడు వినోద్ (vinod) కాంగ్రెస్ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే (Bellampalli MLA)గా ఉన్నారు. ఆయన కుమారుడు వంశీకృష్ణ (Vamshi Krishna) 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీ (Peddapalli Mp)గా విజయం సాధించారు.
Cabinet Expansion | విద్యార్థి నాయకుడి నుంచి..
ధర్మపురి ఎమ్మెల్యే(Darmapuri MLA) అడ్లూరి లక్ష్మణ్కుమార్ (Adluri Laxman Kumar) మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయన తన రాజకీయ జీవితాన్ని విద్యార్థి నాయకుడిగా ప్రారంభించారు. 1982 నుంచి 85 వరకు ఆయన గోదావరిఖని జూనియర్ కాలేజీ ఎన్ఎస్యూఐ(NSUI) అధ్యక్షుడిగా పని చేశారు. 1986 –94 వరకు ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 1996 నుంచి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి.. 2006లో ధర్మారం (ఎస్సీ) రిజర్వుడ్ స్థానం నుంచి జెడ్పీటీసీ(ZPTC)గా పోటీ చేసి గెలిచారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడారం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.
లక్ష్మణ్కుమార్ 2010 నుంచి 2012 వరకు కరీంనగర్ జెడ్పీ ఛైర్మన్ (ZP Chairman)గా పని చేశారు. 2009, 2010, 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2013 నుంచి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో తాజాగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
Cabinet Expansion | సర్పంచ్ నుంచి మంత్రి
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి (Vakiti Srihari) కాంగ్రెస్లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్(Mudiraj) కులానికి చెందిన ఆయనకు సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి వరించింది. శ్రీహరి 2001 నుంచి 2006 వరకు మక్తల్ సర్పంచ్గా పని చేశారు. 2014 నుంచి 2018 వరకు మక్తల్ జెడ్పీటీసీ(ZPTC)గా ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు నారాయణపేట (Narayanpet) జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 2022లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన.. బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. తాజాగా మంత్రివర్గ విస్తరణలో ఆయన చోటు దక్కించుకున్నారు.