అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Floods | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది.
నగరంలోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 12 సెంటిమీటర్ల వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవాహించాయి. వరద దాటికి ముగ్గురు నాలాల్లో గల్లంతయ్యారు. హబీబ్నగర్ (Habib Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్ నాలాలో ఇద్దరు గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా లభించలేదు.
దీంతో హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది వారి కోసం గాలిస్తున్నారు. సోమవారం ఉదయం గాలింపు చర్యలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) పరిశీలించారు. మాంగర్ బస్తీకి చేరుకున్న ఆయన నాలాలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పురానాపూల్, చాదర్ఘాట్, ముసారాంబాగ్ దగ్గర సిబ్బంది గాలిస్తున్నారు.
Hyderabad Floods | నాలాల ఆక్రమణలతోనే..
నాలాల ఆక్రమణలతోనే మాంగర్ బస్తీని వరద ముంచెత్తిందని హైడ్రా కమిషనర్ తెలిపారు. కాలనీలోకి వరద చేరగా.. నీటిలో ఉన్న మంచాన్ని తీసుకు రావడానికి వెళ్లి ఓ వ్యక్తి గల్లంతయ్యాడని చెప్పారు. అతడిని రక్షించడానికి వెళ్లి మరో వ్యక్తి సైతం కొట్టుకుపోయాడన్నారు. ఈ ప్రాంతంలో చాలా మంది నాలాలను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారన్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లో నాలాలను కబ్జా చేశారన్నారు. అయితే మాంగర్ బస్తీలో ఒక దగ్గర బిల్డింగ్ను నాలాలో కట్టారన్నారు. దీంతో అక్కడ నీరు నిలిచి ముంపు పెరిగిందని చెప్పారు.
Hyderabad Floods | ఆందోళన చెందొద్దు
నాలాల్లో ఆక్రమణలను తొలగిస్తామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. మాంగర్ బస్తీలో చాలా ఇళ్లు నాలాలో కట్టారన్నారు. అయితే నాలుగైదు ఇళ్లతో సమస్య ఎక్కువగా ఉందన్నారు. అయితే అన్ని ఇళ్లు తొలగించమని ఆయన పేర్కొన్నారు. నాలాల్లో నిర్మాణాలు ఉన్న అందరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. నష్టం తక్కువగా ఉండేలా నిర్మాణాలను తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కూల్చివేతలు చేపట్టిన వారికి సైతం పరిహారం అందిస్తామని కలెక్టర్ చెప్పారన్నారు. ఇప్పుడు సమస్యకు పరిష్కారం అయ్యేలా కొన్ని నిర్మాణాలను వారంలోగా తొలగిస్తామని తెలిపారు.