అక్షరటుడే, వెబ్డెస్క్:Srikalahasti | దొంగలు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. అమాయకులను నమ్మించి మోసం చేస్తున్నారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు తాజాగా పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని శ్రీకాళహస్తిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఒంటరి మహిళల దగ్గరకు వెళ్లి అధిక ధరకు బంగారం కొంటామని నమ్మిస్తారు. అనంతరం మహిళల ఒంటిపై గల ఆభరణాలను తీసుకుంటారు. తర్వాత వారికి నకిలీ కరెన్సీ నోట్లు(Fake Currency Notes) ఇచ్చి పరారవుతున్నారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ వీరు ఇలాంటి చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు.
శ్రీకాళహస్తి(Srikalahasti)కి చెందిన సునీత అనే మహిళలను శ్యామ్లాల్, కిషన్ అనే వ్యక్తులు ట్రాప్ చేశారు. ఎక్కువ ధరకు బంగారం(Gold) కొంటామని ఆమెకు మాయ మాటలు చెప్పారు. అనంతరం సునీతకు భారీగా నకిలీ కరెన్సీ నోట్లు ఇచ్చి ఆమె వద్ద ఉన్న బంగారంతో ఉడాయించారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.11 లక్షల విలువైన బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
