అక్షరటుడే, వెబ్డెస్క్ : Trump Tariffs | రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై మలి విడత సుంకాలు విధించక పోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సూచనప్రాయంగా వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాపై ట్రంప్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాస్కో నుంచి అధికంగా చమురు కొంటున్నారన్న అక్కసుతో భారత్పై 50 శాతం సుంకాలు విధించారు. రానున్న రోజుల్లో మరింత టారిఫ్లతో పాటు ఆంక్షలు కూడా ఉంటాయని వెల్లడించారు. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్(Russian President Putin)తో భేటీ నేపథ్యంలో ఆయన స్వరంలో మార్పు వచ్చింది. ద్వితీయ సుంకాలను విధించకపోవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఒకవేళ అమెరికా వాటిని అమలు చేయాలని నిర్ణయించుకుంటే అదనపు ద్వితీయ సుంకాలు భారతదేశాన్ని దెబ్బతీస్తాయన్న భయాలు నెలకొన్నాయి.
Trump Tariffs | అవసరం లేదేమో..
రష్యా ఎగుమతి చేసే చమురులో దాదాపు 40 శాతం కొనుగోలు చేస్తున్న భారత్(India)పై రెండో విడత సుంకాలు ఉండవని ట్రంప్ అన్నారు. పుతిన్తో ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశానికి అలాస్కాకు వెళ్లే మార్గంలో ఎయిర్ ఫోర్స్ వన్లో ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. “సరే, అతను (రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్) చమురు క్లయింట్ను కోల్పోయాడు. భారతదేశానికి దాదాపు 40 శాతం సరఫరా చేస్తోంది. చైనా కూడా బాగానే కొనుగోలు చేస్తోంది.. నేను ద్వితీయ ఆంక్షలు లేదా సుంకాలు విధిస్తే అది వారి దృక్కోణం నుంచి చాలా వినాశకరమైనది. బహుశా నేను అలా చేయనవసరం లేదు ”అని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్, పుతిన్ మధ్య శిఖరాగ్ర సమావేశం సరిగ్గా జరగకపోతే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఇండియాపై ద్వితీయ ఆంక్షలు పెరగవచ్చని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్(US Treasury Secretary Scott Bessant) ఇటీవల వెల్లడించారు. రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇప్పటికే భారత్పై టారిఫ్లు విధించారని, భేటీ సరిగా జరుగకపోతే ఆంక్షలు లేదా ద్వితీయ సుంకాలు విధించే అవకాశముందని తెలిపారు. ఆంక్షలు పెరగవచ్చా, సడలించవవచ్చా అన్నది శిఖరాగ్ర సమావేశంలో జరిగే నిర్ణయాలను బట్టి ఉంటుందని తెలిపారు.