HomeతెలంగాణBodhan Government Hospital | వైద్యుల్లేరు.. చికిత్స కరువు

Bodhan Government Hospital | వైద్యుల్లేరు.. చికిత్స కరువు

- Advertisement -

అక్షరటుడే, బోధన్‌: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి సమస్యలకు నిలయంగా మారింది. సుమారు మూడెకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఈ ఆస్పత్రికి బోధన్​ ప్రజలే కాకుండా పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా రోగులు వస్తుంటారు. రెండేళ్ల క్రితం జిల్లా ఆస్పత్రిగా అప్​గ్రేడ్​ చేశారు. కాని అభివృద్ధికి నిధులివ్వలేదు. వసతులు కల్పించలేదు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్​ చేయడమే పనిగా పెట్టుకున్నారు.

Bodhan Government Hospital | ఆస్పత్రి తీరిది..

బోధన్​ జిల్లాస్పత్రిలో మొత్తంగా 52 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా.. కేవలం 18మంది మాత్రమే ఉన్నారు. 120 మంది నర్సింగ్​ స్టాఫ్​కు 74 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వచ్చిన పేషెంట్లకు పూర్తిస్థాయిలో వైద్యం అందించడం గగనంగా మారింది.

Bodhan Government Hospital | గైనిక్​ విభాగం ఖాళీ..

ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రసవాలు జరగాలని వైద్యాధికారులు గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. కాని గర్భిణులు జిల్లా ఆస్పత్రికి వస్తే కనీసం నాడిపట్టి చూసేవారే కరువయ్యారు. గైనికాలజిస్ట్​ లేక గర్భిణుల అవస్థలు అన్నీఇన్నీకావు. దీంతో పేదలు వ్యయప్రయాసలకోర్చి ప్రైవేట్​ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆస్పత్రిలో డెలివరీల శాతం పూర్తిగా పడిపోయింది. ఆస్పత్రిలో కీలక పోస్ట్​ అయిన ఆర్థోపెడిక్​ విభాగం సైతం ఖాళీగా ఉంది. రోడ్డు ప్రమాద బాధితులు ఆస్పత్రికి వస్తే కేవలం ప్రథమ చికిత్స చేసి పంపిస్తున్నారు.

రిస్క్​లేని కేసులు మాత్రమే చూస్తున్నాం

రాహుల్​, ఆస్పత్రి సూపరింటెండెంట్,​ బోధన్

ఆస్పత్రిలో రిస్క్​ లేని కేసులను మాత్రమే అడ్మిట్​ చేసుకుంటున్నాం. ప్రధానం గైనకాలజిస్ట్​, ఆర్థోపెడిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుండె వైద్యనిపుణుడు కూడా లేకపోవడం ఇబ్బందిగా మారింది. అందుకే పేషెంట్ల ఆరోగ్య దృష్టా నిజామాబాద్​ జీజీహెచ్​కు రిఫర్​ చేయాల్సి వస్తోంది. ఆశావర్కర్లకు సైతం నార్మల్​ డెలివరీ కేసులు మాత్రమే తీసుకురావాలని చెప్పాం.