అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్ట్లోని నీళ్లు రంగుమారాయి. ప్రాజెక్ట్లోని నీళ్లు ఇలా రంగు మారడంతో పర్యాటకులు (Tourists) ఒకింత ఆశ్యర్యపోయారు.
ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో లేకపోవడంతో నిలువ ఉన్న నీళ్లు ఆకుపచ్చ వర్ణంలో కనిపించాయి. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. వర్షాల జాడ లేకపోవడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80 నీటి నిలువకు గాను 1391.06 అడుగులు 4.50 నీరు నిల్వ ఉంది. వెయ్యి క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు.
వర్షాల జాడ కరువు
నిజాంసాగర్ ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవకపోవడంతో ఇన్ఫ్లో రావడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్ ఇప్పటి వరకు రెండు మూడు రోజుల పాటు మాత్రమే వందల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. వర్షాలు భారీగా కురిసి ప్రాజెక్టు నిండుకుండలా మారాలని అన్నదాతలు వరుణుడిని ప్రార్థిస్తున్నారు.