అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కొడుకు వెళ్లిపోయాడని ఆ తల్లి కుంగిపోలేదు. కామారెడ్డిలో దొరికిన ఒక అమ్మాయిని పెంచుకుని పెళ్లి చేసి పంపించింది.
మంగళవారం ఆ తల్లి మృతి చెందగా తానే కొడుకునని అంత్యక్రియలు నేనే చేస్తాను.. మా ఊరికి తీసుకెళ్తాను.. అని వచ్చిన కొడుకును గ్రామస్థులు నిలదీశారు. నువ్వెవరో తెలియదంటూ వెళ్లగొట్టారు.. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేటలో (Old Rajampet) చోటుచేసుకుంది.
గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సల్మాబేగం మహిళను ఆమె కొడుకు 20 సంవత్సరాల క్రితం వదిలి వెళ్లిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు తనను వదిలి వెళ్లిపోవడంతో కొద్దిరోజులు బాధపడింది.
తన రాత ఇంతే అనుకుని బతుకు వెళ్లదీసింది. కాగా, కొద్దిరోజులకు కామారెడ్డి పట్టణంలో కరిష్మా బేగం అనే చిన్నారి దొరికడంతో.. ఆమెను పెంచుకుంది. కరిష్మాబేగం పెద్దయ్యాక పెళ్లి చేసింది. పెళ్లయినప్పటికీ పెంచిన తల్లి మంచి చెడులన్ని కరిష్మానే చూసుకునేది. గ్రామంలో కూడా మంచి పేరు తెచ్చుకుంది.
అయితే మంగళవారం సల్మాబేగం మృతి చెందింది. 20 ఏళ్లుగా అటువైపు రాని కొడుకు తల్లి చనిపోయిన విషయం తెలుసుకుని అంత్యక్రియలు నేనే చేస్తానని వచ్చాడు.
తల్లి మృతదేహాన్ని తీసుకెళ్తానని పట్టుబట్టాడు. దీంతో కొడుకుతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. 20 ఏళ్ల తర్వాత తల్లి ఇప్పుడు గుర్తుకొచ్చిందా.. అంటూ నిలదీశారు.
అసలు నువ్వెవరో తమకు తెలియదని గ్రామస్థులు తేల్చిచెప్పి అతడిని వెళ్లగొట్టారు. అయితే ఇన్నేళ్ల పాటు సల్మాబేగం మంచి చెడులు చూసిన కరిష్మాయే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు.
ఇన్నాళ్లుగా లేని ప్రేమ తల్లి చనిపోయాక రావడంతో ఆస్తి కోసమే వచ్చి ఉంటాడని గ్రామస్థులు అనుమానించారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి.