అక్షరటుడే, వెబ్డెస్క్: Supreme Court Judge | ఢిల్లీలో వీధికుక్కలపై ఇటీవల తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ (Judge Justice Vikram Nath) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోర్టు గదిలోనూ, బయటా హాస్యంతో పాటు చతురోక్తులతో ఆకట్టుకుంటారని పేరొందిన ఆయన.. వీధి కుక్కల కేసులో (Dogs Case) ఇచ్చిన తీర్పుతో పౌర సమాజం తనను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసిందన్నారు.
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వీధికుక్కలను (Street Dogs) తరలించాలన్న ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనం ఆగస్టు 22న సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, కేరళ రాజధాని తిరువనంతపురంలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ (NALSA) నిర్వహించిన మానవ-వన్యప్రాణుల సంఘర్షణపై జరిగిన ప్రాంతీయ సమావేశంలో జస్టిస్ విక్రమ్నాథ్ కీలక ప్రసంగం చేశారు.
Supreme Court Judge | గుర్తింపు తీసుకొచ్చారు..
ఈ కేసును తనకు అప్పగించినందుకు భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయికి (Chief Justice of India BR Gavai) జస్టిస్ విక్రమ్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. “చాలా కాలంగా, నేను నా చిన్న చిన్న పనులకు చట్టపరమైన సమాజంలో ప్రసిద్ధి చెందాను, కానీ ఈ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొత్తం పౌర సమాజంలో నాకు గుర్తింపు ఇచ్చినందుకు వీధి కుక్కలకు కూడా నేను కృతజ్ఞుడను. ఈ కేసును నాకు అప్పగించినందుకు మా ప్రధాన న్యాయమూర్తికి నేను కృతజ్ఞుడను” అని 2027లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ నాథ్ పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశానికి తాను హాజరయ్యానని, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సహా న్యాయవాదులు వీధికుక్కల సమస్య గురించి తానను ప్రశ్నలు అడిగారని తెలిపారు. “కుక్కల ప్రేమికులే కాకుండా కుక్కలు కూడా నాకు ఆశీస్సులు, శుభాకాంక్షలు ఇస్తున్నాయని నాకు సందేశాలు వస్తున్నాయి” అని ఆయన పేర్కొన్నారు.