అక్షరటుడే, వెబ్డెస్క్ : Asaduddin Owaisi | పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను అర్ధాంతరంగా ఆపివేయడాన్ని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. పహల్గామ్ ఘటనకు తగిన బుద్ధి చెప్పాలని ఒక భారతీయుడిగా కోరుకుంటానని, అయితే, కేంద్ర ప్రభుత్వం (Central Government) మధ్యలోనే ఆపడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.
మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన పూణెలో విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత పాకిస్తాన్పై (Pakistan) సైనిక చర్యను నిలిపివేయడాన్ని ఆయన విమర్శించారు. “ఒక భారతీయుడిగా పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కు తగిన సమాధానం ఇవ్వడానికి తగిన అవకాశం ఏర్పడింది. అయితే, వారు (కేంద్ర ప్రభుత్వం) ఎందుకు ఆగిపోయారో నాకు ఆశ్చర్యంగా ఉంది” అని ఒవైసీ అన్నారు.
Asaduddin Owaisi | కలల్లో బతకను..
పహల్గామ్ ఉగ్రవాద దాడి సమయంలో మీరే ప్రధానమంత్రి అయితే ఏమి చేసేవరని విలేకరులు అడిగిన ప్రశ్నను ఒవైసీ (Asaduddin Owaisi) తోసిపుచ్చారు. తాను ఊహాగానాలలో మునిగిపోనని, వాస్తవికతపైనే దృష్టి పెట్టడానికి ఇష్టపడతానన్నారు. “ఈ విషయాల గురించి కలలు కనడం నాకు ఆసక్తి లేదు. నేను వాస్తవికతపై దృష్టి పెడతాను. నా పరిమితులను అర్థం చేసుకుంటాను. నా లక్ష్యం ప్రధానమంత్రి పదవిని చేపట్టడం లేదా మంత్రి కావడం మాత్రమే కాదు” అని ఆయన పేర్కొన్నారు.
Asaduddin Owaisi | ‘యుద్ధ వాతావరణం ఏర్పడింది’
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో గుజరాత్ నుంచి కశ్మీర్ వరకు పాకిస్తాన్ డ్రోన్లు కనిపించడంతో దేశవ్యాప్తంగా వాతావరణం మారిపోయిందని చెప్పారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు, విమానాశ్రయ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న తర్వాత భారతదేశం తన దాడులను నిలిపివేయడాన్ని ప్రస్తావిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “దేశం మొత్తం పాకిస్తాన్కు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంది, కానీ మీరు (ప్రభుత్వం) ఆగిపోయారు. అలాంటి అవకాశాలు మళ్లీ రావు, కానీ ప్రభుత్వం ఆ అవకాశాన్ని కోల్పోయింది” అని ఒవైసీ వ్యాఖ్యానించారు.
Asaduddin Owaisi | క్రికెట్ ఆడొద్దు కదా..?
ఇటీవల ముగిసిన ఆసియా కప్లో (Asia Cup) భారతదేశం పాకిస్తాన్తో క్రికెట్ ఆడడంపై ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది జాతీయ భావాలకు విరుద్ధమని అన్నారు. మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని చెప్పారు.