అక్షరటుడే, ధర్పల్లి: Dharpally | స్కూల్కు ఫోన్ తీసుకొచ్చాడనే నెపంతో ఓ విద్యార్థికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఈ ఘటన ధర్పల్లి మండలంలో చోటు చేసుకుంది. బంజారా సేవా సంఘం (Banjara Seva sangham) నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుబ్బాక (dubbaka) గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో గతనెల 20 తేదీన బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు ఓ విద్యార్థి స్కూల్కు ఫోన్ తీసుకెళ్లాడు. దీంతో ఆగ్రహించిన హెచ్ఎం ఆ విద్యార్థిని కొట్టి.. దూషించారని సంఘం నాయకులు ఆరోపించారు. అలాగే విద్యార్థికి టీసీ ఇచ్చి.. తల్లిదండ్రులను పోలీస్స్టేషన్ పిలిపించారని.. ఇది ఎంతవరకు సమంజసమని సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గురువారం సుమారు 30 మంది సల్పబండ తండావాసులు పాఠశాలకు వచ్చి హెచ్ఎం నిర్వాకాన్ని ఖండించారు. పాఠశాలకు తరలివచ్చిన వారిలో మాజీ సర్పంచ్ శర్మాన్ నాయక్, తండానాయక్, శంకర్ నాయక్, కారోబార్ బాద్యానాయక్, అమనార్, రమేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.