అక్షరటుడే, ఇందూరు: Liberation Day | హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని 12(టీ) బెటాలియన్ ఎన్సీసీ (NCC) కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (Union Ministry of Information and Broadcasting), సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (Central Bureau of Communication) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Giriraj Government Degree College) మంగళవారం హైదరాబాద్ లిబరేషన్ డే ఫోటో ఎగ్జిబిషన్ (Liberation Day Photo Exhibition) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విమోచన దినోత్సవం కోసం పోరాడిన సంఘటనలను ఫొటో ఎగ్జిబిషన్ రూపంలో ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ఆనాటి వ్యక్తుల గురించి తెలుసుకోవడం యువతకు ఎంతో అవసరమన్నారు. ఇప్పటి యువత అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు.
అనంతరం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మానాయక్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసేందుకు పోరాడిన వీరుల పోరాటం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అనాటి వీరులు రాంజీ గోండు, కొమురంభీం, చాకలి ఐలమ్మ, బండి యాదగిరి, భాగ్యరెడ్డి వర్మ, నారాయణరావు, వందేమాతరం రామచంద్రరావు తదితర ప్రముఖుల ఫొటోలను, వారి చరిత్రను ఏర్పాటు చేశామన్నారు.
బైరాన్పల్లి ఘటన (Byranpally incident), పరకాల మరణకాండ, బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు, వందేమాతరం ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఆపరేషన్ పోలో వంటి ప్రధాన ఘట్టాలను వివరించామని తెలిపారు. ఎగ్జిబిషన్ ఈనెల 18 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.