అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | మున్సిపల్, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ (GHMC) అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం సమావేశం నిర్వహించారు. వీధి దీపాల (Street Lights) నిర్వహణపై ఆయన సమీక్షించారు.
రాష్ట్రంలో ఎల్ఈడీ (LED) వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని సీఎం ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలని చెప్పారు. గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చటంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన లైట్లు వెలుగుతున్నాయ లేదా, కొత్తగా ఎన్ని అవసరమో సర్వే చేయాలని సూచించారు.
CM Revanth Reddy | ఎంపీడీవోలు పర్యవేక్షించాలి
గ్రామాల్లో రాత్రి పూట ఎల్ఈడీ లైట్లు పని చేయటంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని సీఎం పేర్కొన్నారు. అన్ని గ్రామాల ఎల్ఈడీ డ్యాష్బోర్డు మండల స్థాయిలో ఎంపీడీవో (MPDO) పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. జిల్లాలో అడిషనల్ కలెక్టర్కు ఈ బాధ్యతలు అప్పగించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్ఈడీ లైట్లున్నాయని అధికారులు చెప్పారు. వరంగల్, నల్గొండ, జనగాం, నారాయణపేట జిల్లాల్లో ఎల్ఈడీ లైట్ల కాంట్రాక్టు ఏజెన్సీ ఆధ్వర్యంలో ఉందని వివరించారు. అన్ని గ్రామాల్లో సర్పంచులకే వీటిని అప్పగిస్తే.. నిర్వహణ, విద్యుత్ దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట పడుతుందని సీఎం అన్నారు.
CM Revanth Reddy | టెండర్లు పిలవాలి
రాష్ట్రంలో అన్ని ఎల్ఈడీ లైట్లను హైదరాబాద్ (Hyderabad)లోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5.50 లక్షల ఎల్ఈడీ లైట్లు ఉన్నాయని, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ సిటీని కూడా కలిపితే మొత్తం 7.50 లక్షల లైట్లు అవసరమవుతాయని మున్సిపల్ శాఖ నివేదించింది. కోర్ అర్బన్ సిటీ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా చేరిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఎల్ఈడీ లైట్ల అవసరాన్ని అంచనా వేయాలని సీఎం సూచించారు. కొత్తగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ఎల్ఈడీ లైట్ల తయారీలో పేరొందిన కంపెనీలను ఆహ్వానించాలని, ఏడేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు ఆ కంపెనీలకు అప్పగించాలన్నారు.
CM Revanth Reddy | సోలార్ విద్యుత్ను పరిశీలించాలి
ఎల్ఈడీ లైట్లతో పాటు కంట్రోల్ బాక్స్ల ఏర్పాటు, వాటి పనితీరుపై పర్యవేక్షణ చేయాలని రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఐఐటీ (Hyderabad IIT) లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాలకు ప్రతి నెలా రూ. 8 కోట్ల కరెంటు బిల్లు వస్తుందని ఆయన అన్నారు. దీంతో సోలార్ విద్యుత్ వినియోగించే అంశంపై పరిశీలన చేయాలని సూచించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.