Homeతాజావార్తలుMinister Rajanarsimha | వారికి ప్రజలే గుణపాఠం చెబుతారు.. మంత్రి రాజనర్సింహా కీలక వ్యాఖ్యలు

Minister Rajanarsimha | వారికి ప్రజలే గుణపాఠం చెబుతారు.. మంత్రి రాజనర్సింహా కీలక వ్యాఖ్యలు

బస్తీ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి దామోదర్​ రాజనర్సింహా తెలిపారు. బీఆర్​ఎస్​ నేతలు ప్రభుత్వ ఆస్పత్రులపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Rajanarsimha | ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్​ రాజనర్సింహా తెలిపారు. రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వ హాస్పిటళ్లపై కొందరు బురద జల్లుతున్నారని విమర్శించారు.

బీఆర్​ఎస్​ నేతలు కేటీఆర్ (KTR)​, హరీశ్​రావు (Harish Rao), జగదీశ్​ రెడ్డి తదితరులు మంగళవారం హైదరాబాద్​లోని (Hyderabad) పలు బస్తీ దవాఖానాలను సందర్శించిన విషయం తెలిసిందే. వారు మాట్లాడుతూ ఆయా దవాఖానాల్లో వసతులు, మందులు లేవని ఆరోపించారు. ఈ క్రమంలో మంత్రి రాజనర్సింహా (Minister Rajanarsimha) వారికి కౌంటర్​ ఇచ్చారు. పేదలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ హాస్పిటళ్లపై కొంతమంది బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

Minister Rajanarsimha | మెరుగైన వైద్య సేవలు

బస్తీ దవాఖానాల ద్వారా ప్రతి రోజూ సుమారు 45 వేల మంది పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డయాగ్నస్టిక్స్​ హబ్​ (Diagnostics Hub) ద్వారా బస్తీ దవాఖానాలకు వచ్చే రోగులకు 134 రకాల పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. 24 గంటల్లో టెస్ట్ రిపోర్ట్​లను సైతం అందిస్తున్నట్లు తెలిపారు. బస్తీ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందుతుండడంతో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రోగుల రద్దీ తగ్గిందన్నారు.

Minister Rajanarsimha | ప్రైవేట్ హాస్పిటళ్లకు లబ్ధి చేకూర్చేలా..

రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ హాస్పిటళ్లపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రైవేట్​ ఆస్పత్రులకు లబ్ధి చేకూర్చే విధంగా బీఆర్​ఎస్​ నాయకులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇలాంటి కుట్రపూరిత చర్యలు డాక్టర్లు, సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు. బస్తీ దవాఖానాల్లో మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.