అక్షరటుడే, వెబ్డెస్క్ : Amaravati | ప్రస్తుతం ప్రతి ఒక్కరు సోషల్ మీడియా (Social Media)ను వినియోగిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో పోస్టులు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చిక్కులు తప్పవు.
ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దు. అలా పెడితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే కొందరు అధికారులు మాత్రం అప్పుడప్పుడు ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టి చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఒక అధికారిపై వేటు వేసింది.
Amaravati | ఫేస్బుక్లో ఫొటోలు పెట్టడంతో..
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి (Tirupati) జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ ఫేస్బుక్లో ఫొటోలు పెట్టారు. కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. వాణిజ్య పన్నులశాఖ ప్రాంతీయ ఆడిట్, ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ రాజధాని అమరావతిపై ఫేస్బుక్లో వివాదాస్పద పోస్టులు పెట్టారు.దీంతో సదరు అధికారి పోస్ట్తో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజధానిలో ప్రభుత్వం మూడు రిజర్వాయర్లు నిర్మించనుందంటూ వచ్చిన వార్తను ఆయన ట్యాగ్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం మూడు రిజర్వాయర్లెందుకు? అమరావతినే ఒక రిజర్వాయర్గా కట్టాలని పోస్ట్ చేశారు. అంతేగాకుండా ఒకే ఒక్క వర్షం, అమరావతి జలమయం అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో విచారణ జరిపిన ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Amaravati | తెలంగాణలో..
గతంలో తెలంగాణలో సైతం ఓ అధికారి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై పెద్ద దుమారమే రేగింది. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) కంచె గచ్చిబౌలి భూముల వివాదం సమయంలో ఏఐ జనరేటెడ్ పోస్ట్ను షేర్ చేశారు. దీంతో ప్రభుత్వం ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు సైతం స్మితా సభర్వాల్కు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నారు.