అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఆర్మూర్ పట్టణంలో పారిశుధ్యం అస్తవస్త్యంగా తయారైంది. ముందస్తు వర్షాల కారణంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిల్వ ఉంటోంది. ఇక భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. డ్రైనేజీల నిర్వహణ లేక పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని, మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు ఉండవచ్చని వాతావరణ శాఖ (Meteorological Department) ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పట్టణంలోని డ్రెయినేజీల్లో పూడిక తొలగించి.. మురుగు, వరద నీరు సక్రమంగా పారేలా ముందస్తు చర్యలు చేపట్టాలి. కానీ, పట్టణంలో మున్సిపల్ శానిటేషన్ అధికారులు, సిబ్బంది (municipal sanitation system) నిద్రావస్థలో ఉన్నారు. గతంలో లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు చేరిన ఘటనలున్నాయి. ఈ సీజన్లో ఇలాంటి ఘటనలకు తావులేకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పట్టణం అతలాకుతలంగా మారింది. హౌసింగ్ బోర్డ్ కాలనీ, కింది బజార్, మీది బజార్, జిరాయత్ నగర్, రాజారాం నగర్, పెర్కిట్, మామిడిపల్లిలోని పలు లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి వరదనీరు (Flood water) చేరింది. దీంతో ఇళ్లలోని సామగ్రి నీటిలో తడిచిపోయిందని కాలనీవాసులు వాపోతున్నారు. కాగా.. మున్సిపల్ అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, తాత్కాలికంగా సహాయక చర్యలను చేపట్టారు.
Armoor | శానిటేషన్ పై పట్టింపేది!
పట్టణంలో మున్సిపల్ శానిటేషన్ విభాగం (municipal sanitation department) పై ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా అధికారుల పర్యవేక్షణ లోపంతోనే పారిశుధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి అధికారులను అప్రమత్తం చేయాలని కోరుతున్నారు.