అక్షరటుడే, వెబ్డెస్క్: Sirikonda : అమ్మమ్మ ఇంటికి అమ్మతో కలిసి వచ్చాడు. అమ్మమ్మ, తాతయ్యలను చూసి మురిసిపోయాడు. వారు కొనిచ్చిన సైకిల్ను ఇంటి ముంగిట సరదా తొక్కుతూ తన ప్రపంచంలో హ్యాపీగా ఉంటున్న ఆ బాలుడిని చూసిన విధికి కన్ను కుట్టిందేమో.. ఆ ముద్దులొలికే బాలుడి మురిపెం తీరకుండానే మృత్యు ఒడికి చేర్చాడు. దీంతో మూడేళ్లు కూడా నిండకుండానే ఆ బాలుడి నూరేళ్ల జీవితం అర్ధంతంగా ముగిసింది.
ఓ ఇంటి యజమాని నిర్లక్ష్యానికి చిన్నారి బాలుడు బలయ్యాడు. ఇంటి బయట ఇంకుడు గుంత తవ్వించి, వదిలేసిన ఆ ఇంటి యజమాని నిర్లక్ష్యానికి పాపం చిన్నారి బాలుడు తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇంటి వాకిట సైకిల్ తొక్కుకుంటూ బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో చోటు చేసుకుంది.
Sirikonda : వివరాల్లోకి వెళ్తే..
సిరికొండ మండలంలోని కొండాపూర్కు చెందిన రాణికి నిజామాబాద్ రూరల్ మండలం కులాస్పూర్కు చెందిన గంగసాయిలుకు వివాహం అయింది. వీరికి రిత్విక్(3) అనే కుమారుడు ఉన్నాడు. కాగా, రాణి పక్షం రోజుల క్రితం తన పుట్టిళ్లు అయిన కొండాపూర్కు వచ్చింది.
కాగా, శుక్రవారం(జులై 11) మధ్యాహ్నం సమయంలో రిత్విక్ ఇంటి బయట రోడ్డుపై చిన్న సైకిల్ తొక్కుకుంటూ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడే రోడ్డు పక్కన ఉన్న ఇంకుడు గుంతలో పడిపోయాడు. ఆ ఇంకుడు గుంత కొంత కాలం క్రితం తవ్వి అలాగే వదిలేయడంతో నీరు చేరి, మురుగు గుంతగా మారింది. రిత్విక్ అందులో పడిపోవడంతో మురుగు నీటిలో మునిగిపోయాడు.
బాబు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గాలించారు. మురుగు గుంతలో నురగలు రావడంతో అనుమానం వచ్చి చూడగా.. రిత్విక్ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించగా.. బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Sirikonda : నిర్లక్ష్యమే బలిగొంది..
బాలుడిని బలిగొన్న ఇంకుడు గుంతను ఇంటి యజమాని గత కొంత కాలం క్రితం తవ్వి అలాగే వదిలేశాడు. దీంతో ఇటీవల వర్షాలు కురిసి, మురుగు గుంతగా మారింది. దీనిని స్థానికులు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. పల్లెల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు లేకుండా పోయారు. అటు ఇంటి యజమాని నిర్లక్ష్యం వహించాడు. ఫలితంగా బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.