HomeతెలంగాణMP Aravind | అధిష్టానం జోక్యం చేసుకోవాలి.. బండి, ఈట‌ల వివాదంపై అర్వింద్

MP Aravind | అధిష్టానం జోక్యం చేసుకోవాలి.. బండి, ఈట‌ల వివాదంపై అర్వింద్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:MP Aravind | కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) , మల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల రాజేందర్ (MP Eatala Rajender) మ‌ధ్య వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు అధిష్టానం జోక్యం చేసుకోవాల‌ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. బుధ‌వారం ఢిల్లీలో ఆయ‌న విలేరుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్‌, ఈట‌ల మ‌ధ్య చెల‌రేగిన వివాదంపై అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స్పందించారు. ఈ వ్య‌వ‌హారాన్ని అంత పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, అన్ని పార్టీల్లోనూ విభేదాలు, అభిప్రాయ భేదాలు ఉండ‌డం స‌హ‌జ‌మేన‌న్నారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల్లోనూ విభేదాలు ఉన్నాయన్నారు.

MP Aravind | పార్టీల‌న్నాక విభేదాలుంటాయి..

పార్టీ అన్ని అన్నాక కొన్ని వివాదాలు ఉంటాయ‌ని, వాటిని భూత‌ద్దంలో పెట్టి చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని అర్వింద్ (MP Aravind) పేర్కొన్నారు. త‌మ పార్టీలోనే కాదు, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ల‌లోనూ వివాదాలు లేవా? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు.. ఆయ‌న అలా మాట్లాడుతుంటే ఆ పార్టీ హై కమాండ్ ఏం చేస్తోంది? అలాగే కొండా మురళి, కొండా సురేఖలు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలియ‌దా? అని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్‌లో అంత‌ర్గ‌త పోరు ఉంద‌ని, కవిత, కేటీఆర్ ఏం చేస్తున్నారో మనం చేస్తూనే ఉన్నామ‌ని తెలిపారు.

MP Aravind | అధిష్టానం జోక్యం చేసుకుంటే స‌రి..

పార్టీలో కొన్ని కొన్ని వివాదాలు స‌హ‌జ‌మ‌ని, బీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి ఈట‌ల రాజేందర్, బండి సంజయ్‌ల విషయంలో కూర్చోని మాట్లాడితే స‌రిపోతుంద‌ని అర్వింద్ పేర్కొన్నారు. అవసరమైతే బీజేపీ అధిష్టానం పెద్దలు మాట్లాడాలని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈటల, బండి సంజయ్‌ల విషయంలో బీజేపీ కేంద్ర హై కమాండ్(BJP Central High Command) నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేయాల‌ని సూచించారు.

MP Aravind | మిస్ కాల్ ఇస్తే రాజాసింగ్‌కు స‌భ్య‌త్వం..

గోషామ‌హల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Raja Singh) త‌మ పార్టీలోకి వ‌స్తామంటే వ‌ద్ద‌న‌మ‌ని నిజామాబాద్ ఎంపీ తెలిపారు. రాజాసింగ్ రాజీనామాపై విలేక‌రులు అడిగిన ప్ర‌శ్నకు స్పందించిన అర్వింద్‌.. ఆయన సస్పెండ్ కాలేదని.. రిజైన్ చేశారని గుర్తుచేశారు. రాజాసింగ్ రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే మెంబర్‌షిప్ తీసుకోవచ్చని సూచించారు. కొన్ని విషయాల్లో మనస్థాపం చెంది రాజాసింగ్ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. బీజేపీలో చేర‌డానికి పార్టీ నాయ‌క‌త్వం మిస్డ్ కాల్ ద్వారా స‌భ్య‌త్వం తీసుకునే అవ‌కాశం క‌ల్పించింద‌న్నారు. రాజాసింగ్ రావాల‌నుకుంటే ఒక మిస్డ్‌కాల్ ఇచ్చి పార్టీలో చేర‌వ‌చ్చ‌న్నారు. రాజాసింగ్ ఎక్కడున్నా తాము గౌరవిస్తామని, ఆయన ఐడియాలాజికల్ మ్యాప్ అని అభివర్ణించారు.

MP Aravind | ప‌ని చేయ‌కుంటే ప‌క్క‌న పెట్టాలి..

ప‌ని చేయ‌ని నాయ‌కుల‌ను ప‌క్క‌కు పెట్టాల‌ని అర్వింద్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఎంపీలు పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని.. ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలని అన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ(Telangana BJP MP)లకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలన్నారు. తెలంగాణలో వచ్చేవి కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలని.. బీజేపీ శ్రేణులు ఈ విషయాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకమని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు అయ్యే సమయం ఇదని ఉద్ఘాటించారు. ఇందూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తాము గెలుస్తున్నామని ధీమా వ్య‌క్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎంపీ అర్వింద్ పిలుపునిచ్చారు.

Must Read
Related News