అక్షరటుడే, వెబ్డెస్క్ : Vote Chori | తప్పుడు ఆరోపణులు, దుష్ప్రచారంతో భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commissio) ఆక్షేపించింది. ఎన్ని ఆరోపణలు చేసినా తమ రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని, ఇందులో వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పింది.
ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రక్రియలలో అత్యంత పారదర్శకతను అమలు చేస్తున్నామని పునరుద్ఘాటించింది. బీజేపీతో కలిసి ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ (Rahul Gandhi), ఆయన పార్టీ పదే పదే చేస్తున్న ఆరోపణలను ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ) జ్ఞానేశ్కుమార్ ఖండించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చడంతో పాటు ఎన్నికల సందర్భంగా అనుసరిస్తున్న పారదర్శక ప్రక్రియను వెల్లడించారు.
Vote Chori | పార్టీల పట్ల వివక్ష ఉండదు..
ఎక్కడా నేరుగా రాహుల్గాంధీ పేరు ప్రస్తావించని సీఈసీ.. రాజ్యాంగబద్ధ సంస్థపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల (political partys) పట్ల వివక్ష చూపదని సీఈసీ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘానికి ఎలాంటి పక్షపాతం ఉండదని, అన్ని పక్షాలను సమానంగానే చూస్తుందన్నారు. ఓట్ల చోరీ (Votes Chori) పేరుతో కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని తద్వారా ఓటర్లను అవమానపరుస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ తటస్థంగా ఉంటూ రాజ్యాంగ బాధ్యతలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
Vote Chori | విధులకు మాత్రమే కట్టుబడి..
ఎన్నికల సంఘం తన రాజ్యాంగ విధుల నుంచి వెనక్కి తగ్గదని సీఈసీ తేల్చి చెప్పారు. “భారత రాజ్యాంగం (Constitution of India) ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు ఓటరుగా మారాలి. ఓటు వేయాలి. చట్టం ప్రకారం, ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల కమిషన్లో (Election Commisssion) రిజిస్ట్రేషన్ ద్వారా ఏర్పాటవుతుందని మీ అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఎన్నికల కమిషన్ ఒకే రాజకీయ పార్టీల మధ్య ఎలా వివక్ష చూపగలదు? ఎన్నికల కమిషన్కు అందరూ సమానమే. ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా, ఎన్నికల కమిషన్ తన రాజ్యాంగ విధి నుండి వెనక్కి తగ్గదని” ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు.
Vote Chori | డోర్లు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి..
ఎన్నికల సంఘం ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని, ఏవైనా అనుమానాలు ఉంటే వచ్చి నివృత్తి చేసుకోవాలని సీఈసీ సూచించారు. క్షేత్ర స్థాయిలో స్థాయిలో ఓటర్లు, రాజకీయ పార్టీలు, అన్ని బూత్-స్థాయి అధికారులు కలిసి పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందిస్తారని చెప్పారు. ఈ జాబితాను ధ్రువీకరించడం, సంతకం చేయడం, వీడియో టెస్టిమోనియల్స్ కూడా ఇస్తున్నారన్నారు. ఇలా ధ్రువీకరించిన పత్రాలను రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షుల ద్వారా రాష్ట్ర స్థాయి లేదా జాతీయ స్థాయి నాయకులకు చేరకపోవడం లేదా గ్రౌండ్ రియాలిటీని విస్మరించి గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నం జరగడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. బీహార్లోని ఏడు కోట్లకు పైగా ఓటర్లు ఎన్నికల కమిషన్తో నిలబడి ఉన్నప్పుడు, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై లేదా ఓటర్ల విశ్వసనీయతపై ఎటువంటి ప్రశ్నను లేవనెత్తలేరన్నారు.
బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రారంభమైందని మరియు ప్రతి బూత్లో దాదాపు 1.6 లక్షల బూత్ లెవల్ ఏజెంట్లు డ్రాఫ్ట్ ఓటరు జాబితాలను సిద్ధం చేశారని, వీటిని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సంతకాలతో ధ్రువీకరించారని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు.
Vote Chori | దుర్వినియోగం చేస్తారా ?
ఓటరు డేటాను (Voters Data) దుర్వినియోగం చేయడంపై సీఈసీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటర్ల అనుమతి లేకుండా వారి ఫోటోలను మీడియాలో చూపించారని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ (CCTV Footage) లేదా ఓటర్ల వ్యక్తిగత వివరాలను ప్రచారం చేయడం సముచితమేనా? అని ఆయన ప్రశ్నించారు. అధికారిక ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు మాత్రమే ఓటు వేయడానికి అనుమతి ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను హైలైట్ చేస్తూ, ఒక కోటి మందికి పైగా ఉద్యోగులు, 10 లక్షలకు పైగా బూత్-స్థాయి ఏజెంట్లు (Booth level agents), 20 లక్షలకు పైగా పోలింగ్ ఏజెంట్లు లోక్సభ ఎన్నికలను నిర్వహించడంలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో తనిఖీలు, బ్యాలెన్స్ల నిర్మాణంతో ఓటర్లు “ఓట్లను దొంగిలించగలరనే” ఆలోచన నిరాధారమైనదని సీఈసీ తెలిపారు.
Vote Chori | తప్పుడు ఆరోపణలకు భయపడం..
డబుల్ ఓటింగ్ (Digital Voting) అంశంపై కొన్ని ఆరోపణలు వచ్చాయని, కానీ ఎవరు ఎప్పుడూ ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదని కమిషనర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ లేదా ఓటర్లు అలాంటి తప్పుడు ఆరోపణలకు భయపడరని ఆయన స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ కథనాలు ఎన్నికల కమిషన్ను వివాదంలోకి లాగడం ద్వారా ఓటర్లను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఈసీ వివక్షత లేకుండా ఓటర్లతో కలిసి దృఢంగా, నిర్భయంగా నిలబడుతుందన్నారు. ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలు ఉండాలని, ఫ్రూఫ్లు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
‘కొందరు డబుల్ ఓటింగ్ (Double Voting) అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రూఫ్ అడిగితే జవాబు ఇవ్వడం లేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలకు ఎన్నికల కమిషన్ కానీ, ఓటర్లు కానీ భయపడరు. దేశ ఓటర్లను లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికల కమిషన్ భుజంపై తుపాకీ పెట్టే రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. పేదలు, ధనికులు, వృద్ధులు, యువకులు, మహిళలు, మతం, సామాజిక-ఆర్థిక హోదా అనే వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల ఓటర్లకు ఎలక్షన్ కమిషన్ అండగా నిలుస్తోంది. ఇకముందు కూడా నిలుస్తుంది. ఎన్నికల కమిషన్ నిర్భీతిగా వ్యవహరిస్తుంది’ అని స్పష్టం చేశారు.