అక్షరటుడే, వెబ్డెస్క్ : Mallikarjun Kharge | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గురువారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడడంలో మోదీ సర్కారు (Modi Government) విఫలమైందని ఆరోపించారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఇలా ఎన్నడూ జరుగలేదని, ఇప్పుడు కూడా మాపైకి నెపాన్ని మీరు తప్పించుకోలేరన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) భారతదేశంపై మొత్తం 50% సుంకాలు పెంచిన నేపథ్యంలో ఖర్గే మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది ఇటీవలి కాలంలో భారతదేశ విదేశాంగ విధానానికి అతిపెద్ద ఎదురుదెబ్బలలో ఒకటిగా అభివర్ణించారు. జాతీయ ప్రయోజనాలే అతి ముఖ్యమైనవన్న ఖర్గే.. విదేశాంగ విధానంలో సర్కారు పర్తిగా విఫలమైందన్నారు. “మన దౌత్యం వినాశకరంగా దిగజారిపోతున్న సమయంలో ట్రంప్ 50% సుంకాలు వచ్చాయి” అని ఆరోపించారు.
Mallikarjun Kharge | ఆత్మగౌరవం తాకట్టుపెట్టొద్దు..
దేశ సార్వభౌమత్వాన్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టొద్దని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇండియా గతంలో కఠినమైన దశలను ఎలా సమన్వయంగా ఎదుర్కొన్నదో ఈ సందర్భంగా ఖర్గే (Kharge) గుర్తు చేసుకున్నారు. 7వ నౌకాదళ బెదిరింపుల నుంచి అణు పరీక్షల ఆంక్షల వరకు మేము అమెరికాతో మా సంబంధాన్ని ఆత్మగౌరవంతో నడిపించామన్నారు. ప్రధాన మంత్రి మోదీని (Prime Minister Modi) నేరుగా లక్ష్యంగా చేసుకుని ఆయన ‘X’లో సుదీర్ఘ పోస్ట్ చేశారు.
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ 30 సార్లు చెప్పినా మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. గతేడాది నవంబర్ 30న ట్రంప్ బ్రిక్స్ దేశాలపై 100% సుంకం విధిస్తానని బెదిరించినా, అక్కడే ఉన్న ప్రధాని మోదీ నవ్వుతూ ఉన్నాడన్నారు. ట్రంప్ సుంకాలు బాదుతుంటే మీరేమీ చేయడం లేదు. వ్యవసాయం, చిరు వ్యాపారాల వంటి కీలక రంగాలను కాపాడేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. నెలల కొద్దీ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నా కొలిక్కి తేలేకపోయారు. ఇది వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. ట్రంప్ ఎన్నిసార్లు బెదిరిస్తున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.